ఈసారి శాసనసభ ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. నిన్న మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్ధిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేయబోతున్నారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “పిఠాపురంలో నన్ను ఓడించడానికి మంత్రి పెద్దిరెడ్డిగారి కుమారుడు మిథున్ రెడ్డిని తీసుకువస్తున్నారట! ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే వైసీపి రూ.100-150 కోట్లు ఖర్చు పెట్టేందుకు వైసీపి సిద్దం చేసిందట! అవసరమైతే ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు పంచేందుకు కూడా వెనకాడకూడదని వైసీపి నిర్ణయించిన్నట్లు తెలిసింది.
అయితే వైసీపి వాళ్ళు లక్ష చొప్పున జనాలకు పంచిపెడితే వద్దనకుండా అందరూ తీసుకోండి. కానీ మీరందరూ నాకే ఓట్లు వేస్తారని పూర్తి నమ్మకం ఉంది. ఇప్పటికే పిఠాపురంలో నా గెలుపు, ప్రమాణ స్వీకారం చేయడం కూడా ఖరారు అయిపోయింది. ఎంత మెజార్టీతో గెలుస్తామనేది మాత్రమే తెలియాల్సి ఉంది. పిఠాపురం ప్రజలు నన్ను కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని భావిస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పిఠాపురం నుంచి వైసీపి అభ్యర్ధిగా తనపై పోటీ చేయబోతున్న వంగా గీత, కాకినాడ నుంచి వైసీపి అభ్యర్ధిగా లోక్సభకు పోటీ చేయబోతున్న చలమలశెట్టి సునీల్ని ఉద్దేశ్యించి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“ఒకప్పుడు వారిద్దరూ ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఇద్దరూ ఓ తప్పు పార్టీని ఎంచుకొని దానిలో మాకు ప్రత్యర్ధులుగా ఉన్నారిప్పుడు. భవిష్యత్లో వారిద్దరూ తిరిగి జనసేనలోకి తిరిగి వస్తారని ఆశిస్తున్నాను,” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై, వంగా గీత చాలా ఘాటుగా స్పందించారు. “నేను పవన్ కళ్యాణ్లాగ ఎన్నికల సమయంలో ఇక్కడ వాలిపోయి, అయిపోగానే మాయం అయిపోయే క్యాండిడేట్ని కాను. ఎల్లప్పుడూ ఇక్కడే ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటాను. కనుక పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు నన్ను అభిమానిస్తారు. కనుక ఇక్కడ నేనే భారీ మెజార్టీతో గెలుస్తాను. ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో ఖాయం అయిపోయింది,” అని అన్నారు.
డబ్బు పంచడం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అప్పుడే ఆయన డబ్బు పంచడం గురించి మాట్లాడుతున్నారు. నా చేతిలో ఓడిపోతాననే భయంతోనే ఆయన ఆవిదంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ జగన్ ఇస్తున్న సంక్షేమ పధకాలతో చాలా సంతృప్తిగా ఉన్నారు. కనుక మేము వేరేగా ఎవరికీ డబ్బు పంచక్కరలేదు. మా అధినేతపై అభిమానంతోనే అందరూ వైసీపికి ఓట్లు వేసి మమ్మల్ని గెలిపిస్తారు,” అని వంగా గీత అన్నారు.
జనసేనలోకి తిరిగి రావాలనే పవన్ కళ్యాణ్ విజ్ఞప్తిపై స్పందిస్తూ, “నేను 2009లో ప్రజారాజ్యం ద్వారా ఎమ్మెల్యే అయిన మాట వాస్తవం. కానీ నేను డిగ్రీ చదువుతున్న రోజులలోనే రాజకీయాలలో తిరిగే దానిని. నేటికీ రాజకీయాలలోనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ ఆహ్వానించిన్నట్లే నేను కూడా ఆయనను వైసీపిలో చేరమని ఆహ్వానిస్తే బాగుంటుందా?కనుక ఆయన మీడియా ముందుకు వచ్చేటప్పుడు అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది,” అంటూ వంగా గీత పవన్ కళ్యాణ్కు చురకలు వేశారు.




