మారుతీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నయనతార జంటగా నటిస్తున్న “బాబు బంగారం” సినిమా ఆడియో వాయిదా పడింది. ముందుగా అనుకున్న జూలై 9వ తేదీన ఆడియో నుండి ఓ సింగిల్ ట్రాక్ ను విడుదల చేస్తామని, ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అంటే జిబ్రాన్ సంగీతం అందించిన పాటల విడుదలను వాయిదా వేయడం అంటే.., సినిమా విడుదల తేదీగా భావిస్తున్నటువంటి జూలై 29లో కూడా మార్పులు ఉంటాయేమోనన్న సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఆడియోను ఎప్పుడు విడుదల చేసినా, సినిమాను మాత్రం ఈ నెల 29నే విడుదల చేయనున్నారని సమాచారం. సినిమాను వాయిదా వేసే అవకాశం లేదని, ‘బాబు బంగారం’ ముందు సూపర్ స్టార్ రజనీ ‘కబాలి’ ద్వారా బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి సిద్ధమవ్వగా, ఆగష్టు 12వ తేదీన ‘జనతా గ్యారేజ్’తో పాటు ‘ప్రేమమ్’ సినిమాల విడుదలలు కూడా ఉన్నాయి. దీంతో జూలై 29వ తేదీ అయితేనే “బాబు బంగారం”కు బాక్సాఫీస్ వద్ద రెండు వారాల సమయం లభిస్తుందన్న నిర్ణయంతో వెంకీ ల్యాండింగ్ ను ఆ ముహూర్తానికే ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఫస్ట్ టీజర్ అంచనాలను మించి ఉండడంతో వీక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే విక్టరీ లుక్ కూడా అన్ని వర్గాల నుండి ప్రశంసలు లభించాయి. దీంతో నాగ్ కు ‘మనం,’ బాలయ్యకు ‘లెజెండ్’ హిట్ల మాదిరి వెంకీకి ఈ ‘బాబు బంగారం’ కెరీర్ టర్నింగ్ హిట్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.



