వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. రోజుకు 2-3 ట్వీట్లు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ వేస్తారు. అవి ఆయన వేస్తారో లేక ఒక టీమ్ ని పెట్టుకుని వేయిస్తారో తెలీదు గానీ అవి చాల గమ్మత్తుగా ఉంటాయి. తాజాగా ఈరోజు ఆయన ఎంచుకున్న టాపిక్ జగనన్న విద్యాకానుక.
“రాజధాని ఇటుకల కోసం స్కూలు పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ? రియల్ ఎస్టేట్ భూముల విలువ పెంచుకునేందుకు పసివాళ్లని కూడా వదల్లేదు కదా. మీరు వాళ్ల జేబులు ఖాళీ చేస్తే, ఇప్పుడా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు జగన్ గారు. తేడా తెలుస్తోందా?,” అంటూ ట్వీట్ చేశారు.
రాజధాని ఇటుకల కోసం స్కూలు పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ప్రభుత్వ ఖజానాకే వెళ్ళుంటాయి కదా? తెలుగుదేశం పార్టీ తరపున అయితే కలెక్ట్ చెయ్యలేదు. ఆ ప్రకారం ఆ డబ్బుల లెక్కలు ప్రభుత్వం వద్దనే ఉంటాయి. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఆ లెక్కలు ప్రతిపక్ష పార్టీని అడగడం ఏంటో?
ఆ లెక్కలు బయటకు తీసి… అవకతవలకు ఏమైనా ఉంటే బయటపెట్టొచ్చు కాదా? అయినా భూప్రపంచం మీద జరిగే ప్రతిదానికీ అమరావతికి లింకు పెట్టి విమర్శలు చెయ్యడం ఏంటో? ఇప్పటివరకు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా విమర్శలకే పరిమితం అయ్యింది అధికార పక్షం.




