తెలుగుదేశం పార్టీ నేతల మీద ద్వేషంతో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు విచక్షణ కోల్పోతున్నారు. తాజాగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అమరావతిని కులపు రాజధాని అని సంబోధించడం శోచనీయం. నిన్న ఒక పత్రికలో నందమూరి బాలకృష్ణ రాజధానిలో 500 ఎకరాలు కొన్నట్టుగా వచ్చిన వార్తలపై లోకేష్ స్పందించిన విషయం తెలిసిందే. తన మామ నిప్పు అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని సవాలు విసిరారు.
దీనిపై విజయసాయి రెడ్డి స్పందించారు. దీనిపై ఆయన ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. “కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ? అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుంది. ఇన్సైడర్ ట్రేడింగుతో అమాయక రైతుల పొట్టకొట్టి మీరూ, మీ బినామీలు లాగేసుకున్న వేల ఎకరాల స్టోరీలన్నీ సీరియల్గా బయటకొస్తాయి. మీరు నిప్పులో తుప్పులో ప్రజలే చెబుతారు. కాండ్రించి ఉమ్ముతారు” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అసలు ఒక ఎంపీ వాడే భాష, రాజధానిని సంబోధించే తీరు విస్తుగొలుపక మానదు.
తెలుగుదేశం పార్టీ నేతల మీద ఉన్న ద్వేషంతో అసలు నోటికి ఏమొస్తుందో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్ధం కాకుండా ఉంది. ఇది ఇలా ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతల మాటలను బట్టి అమరావతిని రాజధానిగా మార్చడం ఖాయంగా కనిపిస్తుంది. దానికి ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఈ గందరగోళంలో తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.



