గత ఎన్నికలలో నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లను వైసీపి గెలుచుకొని టిడిపిని తుడిచిపెట్టేసింది. అప్పటి నుంచి నెల్లూరు జిల్లా వైసీపి కంచుకోటగా మారింది. కానీ కేవలం 5 ఏళ్ళలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
జిల్లాకు చెందిన ముగ్గురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లాకే చెందిన రాజ్యసభ సభ్యుడు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చేజేతులా బయటకు పంపించేసుకున్నారు.
నెల్లూరులో వైసీపికి ఎదురుగాలి వీస్తోందని పసిగట్టిన నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని మూడు జిల్లాలు జంప్ చేసి నర్సారావుపేటకి మారిపోయారు. దీంతో జిల్లాలో వైసీపి చాలా బలహీనపడింది.
ఇదే సమయంలో జిల్లాకు చెందిన నేతలందరూ టిడిపిలో చేరడంతో జిల్లాలో మళ్ళీ టిడిపి, వైసీపి బలాబలాలు మారిపోయాయి.
జిల్లాలో మిగిలిన వారిలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బలమైన నేతలుగా గుర్తింపు కలిగి ఉన్నారు. కానీ వారిలో కాకాని సజ్జల రామకృష్ణా రెడ్డి మనిషి కావడంతో జిల్లాలో వైసీపి నేతలతో ఆంటీ ముట్టన్నట్లు వ్యవహరిస్తుంటారని వైసీపిలో గుసగుసలు వినిపిస్తుంటాయి.
ఆయనకు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కి మద్య బహిరంగంగానే పోస్టర్స్ యుద్ధాలు జరిగాయి. కనుక అనిల్ సిఫార్సుతో నెల్లూరు అర్బన్ సీటు దక్కించుకున్న డెప్యూటీ మేయర్ మహమ్మద్ ఖలీల్తోనూ ఆయనకు పడదు.
ఇటువంటి పరిస్థితులలో విజయసాయి రెడ్డిని నెల్లూరు లోక్సభ అభ్యర్ధిగా ఖరారు చేయడంతో, ఆయన కష్టాలు మొదలయ్యాయి. ఆయన జిల్లాకు చెందినవారే అయినప్పటికీ ఏనాడూ జిల్లా నేతలతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోలేదు.
ముఖ్యంగా ఇంతవరకు ఆయన ఎన్నడూ ఏ ఎన్నికలలోనూ పోటీ చేయలేదు. ఇప్పుడు లోక్సభ అభ్యర్ధిగా ఆ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై ఈ కొద్దిపాటి సమయంలో పట్టు సాధించాల్సి ఉంటుంది. కానీ ఇంత తక్కువ సమయంలో అది సాధ్యపడేది కాదు.
ఆయనకు జిల్లాలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తప్ప మరెవరూ సహకరించేవారు కూడా లేరు. కనుక ఈసారి నెల్లూరు జిల్లాని బంగారు పళ్ళెంలో పెట్టి టిడిపి, జనసేనలకు అప్పగించేసేందుకే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పంపించిన్నట్లుంది.




