‘కాల్ మనీ’ ఘటనలో తెలుగుదేశం నేతలను ‘సైడ్’ చేసేందుకే విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ను సెలవులో పంపించారని వైకాపా అధినేత జగన్ అధికార ప్రభుత్వంపై మండిపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని, ఈ సెలవులు రెండు మాసాల క్రితమే ప్లాన్ చేసుకుందని స్వయంగా సీపీ గౌతం సవాంగ్ చెప్పినా వైకాపా వర్గాలు వినలేదు. ఈ కేసులో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని సవాంగ్ చెప్పడంతోనే, 24 గంటలు తిరగకుండా ప్రభుత్వమే సెలవుపై పంపిస్తోందని దుయ్యబట్టారు.
అయితే ఇది చెప్పి 24 గంటలు గడవక ముందే విజయవాడ సీపీ తన సెలవును రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ‘కల్తీ మద్యం, కాల్ మనీ’ సంఘటనలలో ప్రజల నుండి పెద్ద ఎత్తున అభియోగాలు వస్తుండడంతో సెలవులను రద్దు చేసుకున్నానని సవాంగ్ ప్రకటించారు. మరి ఇప్పుడు వైకాపా అధినేత ఏమంటారోనని అధికార పక్షాలు మండిపడుతున్నాయి. బహుశా ఈ కేసులో జగన్ పార్టీ నేతలను ఇరికించేందుకే, సీపీ సెలవులను ప్రభుత్వం రద్దు చేసిందని వ్యాఖ్యానిస్తారేమో… అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలపై కౌంటర్లు పడుతున్నాయి. అధికార ప్రభుత్వంపై వైసీపీ వర్గాలు అడ్డగోలు విమర్శలు చేస్తుందనడానికి ఇదొక నిదర్శమని టీడీపీ వర్గాలు ధ్వజమెత్తుతున్నారు.





