వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి ఈసారి నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన జిల్లాకే చెందినవారైనప్పటికీ ఏనాడూ జిల్లాను పట్టించుకోలేదు. ఢిల్లీలో ప్రధాని మోడీతో ఫోటోలు దిగుతూ, జగన్ తరపున అక్కడ వ్యవహారాలు చక్కబెట్టేవారు లేదా పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేవారు.
ఖాళీ దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేసుకొని వ్యంగ్యంగా మెసేజిలు పెట్టడం లేదా ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకునేందుకు హిందీలో మెసేజిలు పెడుతూ కాలక్షేపం చేసేవారు.
మద్యలో కొన్ని రోజులు విశాఖలో చాలా హడావుడి చేశారు కానీ పార్టీలో నేతలతో సమస్యలు మొదలవడంతో మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయారు.
నెల్లూరు జిల్లాని వైసీపి కంచుకోటగా మలిచిన మేకపాటి, ఆనం, కోటం రెడ్డిలను జగన్మోహన్ రెడ్డి బయటకు పంపించేసి, నెల్లూరులో వైసీపి ఉనికిని చాటిచెప్పే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ని నర్సారావుపేటకు షిఫ్ట్ చేసేసిన తర్వాత బీటలు వారిని నెల్లూరు కంచుకోటని విజయసాయి రెడ్డికి అప్పగించారు.
ఇటువంటి పరిస్థితులలో విజయసాయి రెడ్డి వెంట ఎవరూ బలమైన స్థానిక నేతలు లేక, ప్రజలను నమ్మించలేక ముప్పతిప్పలు పడుతున్నారు.
ఇటీవల నియోజకవర్గంలో పర్యటిస్తూ తనని గెలిపిస్తే జిల్లాకు ఐటి కంపెనీలు రప్పించి యువతకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. ఇప్పుడు నెల్లూరుకి విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయిస్తానని చెపుతున్నారు. ఫార్మా కంపెనీల సమస్యలన్నీ తీర్చేస్తానని చెపుతున్నారు.
మళ్ళీ వైసీపిని గెలిపిస్తే… అంటూ భవిష్యత్లో చేయబోయే అభివృద్ధి పనుల జాబితాని వల్లెవేస్తున్నారు. అయితే గత ఎన్నికలలో జిల్లాలో మొత్తం అన్ని సీట్లు వైసీపియే గెలుచుకున్నా, భారీ మెజార్టీతో జగన్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా ఈ 5 ఏళ్ళలో నెల్లూరు జిల్లాని ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఈ 5 ఏళ్ళలో నెల్లూరులో విమానాశ్రయం ఎందుకు ఏర్పాటు చేయలేదు?
వైజాగ్ సదస్సులో 13.50 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో 1,700 పరిశ్రమలు, వాటిలో 6 లక్షల మందికి ఉద్యోగాలని చెప్పారు కదా అవన్నీ ఏవి? అని ప్రజలు, వారి తరపున టిడిపి నేతలు విజయసాయి రెడ్డిని నిలదీస్తున్నారు.
ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలు గత ఎన్నికలలో వైసీపి అన్ని సీట్లు కట్టబెట్టినా నియోజకవర్గాలలో ఏ ఒక్క పని చేయించనందుకే కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరూ పార్టీపై తిరుగుబాటు చేశారని ప్రజలే గుర్తుచేస్తుంటే, విజయసాయి రెడ్డికి వారిని ఏవిదంగా నమ్మించాలో తెలియడం లేదు. గతంలో, వర్తమానంలో ఆలోచన కూడా చేయని పనులను భవిష్యత్ చేస్తామంటే జనం నమ్ముతారని విజయసాయి రెడ్డి ఎలా అనుకున్నారో?




