2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానులను తెర మీదకు తెచ్చింది. పేరుకి మూడు రాజధానులైనా అసలు విశాఖపట్నం మీదే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. అయితే మూడు రాజధానుల ప్రతిపాదన కోర్టులలోనే ఉండిపోయింది. ఇప్పటిదాకా ఆ ప్రతిపాదన అధికారికం కాలేదు.
ఇది ఇలా ఉండగా… రాష్ట్ర విభజనతో హైదరాబాద్ను కోల్పోవడం ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి విశాఖపట్నం అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో 15వ ఆర్థికసంఘం రూ.1,400 కోట్ల గ్రాంట్ను సిఫార్సు చేసింది. నగరాన్ని ప్రధాన ఆర్థిక కేంద్రంగా, అభివృద్ధి సూచీ (గ్రోత్పోల్)గా రూపుదిద్దాలని.. ఇందుకోసం రహదారులు, నీటిసరఫరా, విద్యుత్తు పంపిణీ, భూగర్భ డ్రైనేజీ, అవసరమైన భవనాల నిర్మాణానికి ఏపీ నిధులు కోరింది.
అందువల్ల ఈ మేరకు సిఫార్సు చేశామని ఆర్థిక సంఘం వెల్లడించింది. హైదరాబాద్ కోల్పోవడం ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి విశాఖపట్నం అభివృద్ధికి నిధులు కేటాయించమని కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్థిక సంఘం సిఫార్సు చెయ్యడమంటే విశాఖను కేంద్రం రాజధానిగా గుర్తించినట్టేనా? అనే చర్చ జరుగుతుంది.
మరోవైపు… రాజధాని అనే అంశాన్ని పక్కన పెడితే… ఇది కేవలం సిఫార్సు మాత్రమేనని, కేటాయింపు కాదని… ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపించే సవతి తల్లి ప్రేమ కారణంగా కేటాయింపు అనేది అనుమానమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.





