ఇది వరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపికి ఎదురు దెబ్బ తగిలినప్పుడు అలాంటిదేమీ లేదంటూనే ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసి బయటకు పంపించేశారు. ఇప్పుడు కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికలపై, తమ పార్టీపై ఉండదని చెప్పుకొంటూనే 11 నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చేశారు. మరో 65 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చేయబోతున్నట్లు వస్తున్న వార్తలను సకలశాఖ మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఖండించకపోవడం గమనిస్తే మార్పు అనివార్యమే అని అర్దమవుతోంది.
బహుశః ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై సిఎం జగన్ మంత్రులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక నేడో రేపో సజ్జల వారు ప్రెస్మీట్ పెట్టి తమ అధినేత నిర్ణయాన్ని సమర్ధించుకొంటూ వాదించవచ్చు.
ఒకవేళ 65 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టేయడానికే సిఎం జగన్ ఫిక్స్ అయిపోతే, వైసీపిలో అలజడి చెలరేగడం ఖాయం. ఒకవేళ 65 మంది వైసీపి ఎమ్మెల్యేలు బయటకు పోవాలనుకొన్నా, జగన్మోహన్ రెడ్డి వారికి అటువంటి ఆప్షన్స్ కూడా లేకుండా చేశారు.
కనుక తెలంగాణలో వైఎస్ షర్మిలని ఆ పార్టీ నేతలే బహిష్కరించిన్నట్లు, వైసీపిలో 65 మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యి తమ అధినేతపై తిరుగుబాటు చేసినా ఆశ్చర్యం లేదు. ఇదే జరిగితే ఎన్నికలకు ముందు వైసీపి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
అయితే జగన్మోహన్ రెడ్డికి ఈ మాత్రం తెలియకుండానే తన ప్రభుత్వంలో సగం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడానికి సిద్దపడ్డారనుకోలేము. కనుక ఈ అసంతృప్తి సెగలతో తన ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు ఏదో ఉపాయం ఆలోచించే ఉంటారు.
బహుశః సజ్జల చేత ఇవన్నీ ‘ఎల్లో వార్తలే’ అని ఖండింపజేసి, పరిస్థితులు చెయ్యి దాటిపోకుండా జాగ్రత్త పడవచ్చు. ఆ తర్వాత ఒకరొకరినీ మెల్లగా తప్పిస్తూ మిగిలిన మూడు నెలలు లాగించేయవచ్చు. కానీ 11 నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చినప్పుడు మరో 50-65 మందిని మార్చకుండా ఉంటారా?మార్చక తప్పదని ఐప్యాక్ మొదటి నుంచే చెపుతోంది కదా?కనుక వైసీపిలో ఈ మార్పు అనివార్యంగానే కనిపిస్తోంది.




