ప్రతీ మనిషి ఎదుట మనిషిని బాగా అర్ధం చేసుకున్నాననే అనుకుంటాడు. కుటుంబం, సమాజంలో అందరూ ఒకరినొకరిని పూర్తిగా అర్ధం చేసుకున్నామనే అనుకుంటారు. నిజమేనా? అవునో కాదో చూద్దాం.
ఉదాహరణకి తన భర్త చాలా మంచివాడని భార్య అనుకోవచ్చు. కానీ అదే భర్త ఆఫీసులో బాస్ అయితే తన ఉద్యోగులతో లేదా మరొకరితోనో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంటాడు. లేదా మహిళా ఉద్యోగులతో అసభ్యంగా వ్యవహరించవచ్చు.
అదేవిధంగా భార్య అతని తల్లితండ్రులు, బంధువులతో దుర్మార్గంగా లేదా కపటంగా వ్యవహరిస్తుండవచ్చు. కానీ తన పుట్టింటివారి పట్ల అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలు చూపిస్తుంటుంది. కనుక ఒకరి దృష్టిలో ఆమె గొప్ప ఇల్లాలు. మరొకరి దృష్టిలో ఆమె ఓ దుర్మార్గురాలు.. పొగరుబోతు. అంటే ఒక వ్యక్తి ఇద్దరు వేర్వేరు వ్యక్తుల్లా వ్యవహరిస్తున్నట్లు భావించవచ్చు.
సమాజంలో మనుషులను ఇలా లోతుగా పరిశీలిస్తే అందరూ సమయం సందర్భం బట్టి వేర్వేరు మాస్కులు ధరించి జీవిస్తున్నట్లు అర్ధమవుతుంది.
కనుక ఎవరి ఆలోచనాశక్తి, పరిధిని బట్టి ఎదుట మనిషిలో ఒక చిన్న భాగం మాత్రమే అర్ధం చేసుకోగలం. కానీ కొని పూర్తిగా అర్ధం చేసుకున్నామని గట్టిగా నమ్ముతుంటాము.
కానీ ఆ నమ్మకం వమ్ము అయినప్పుడు మనుషులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనవుతుంటారు. ఎందువల్లనంటే తాము పూర్తిగా అర్ధం చేసుకున్నామని భావిస్తున్న వ్యక్తి మరోవిధంగా కనిపించడం వల్లనే కదా?దానినే మనుషులు మోసం, త్యాగం లేదా మరో పేరు పెట్టుకోవచ్చు.
ఈ నమ్మకాలు, అంచనాలను బట్టే మనుషుల చర్యలు, ప్రతి చర్యలు, బంధాలు, ద్వేషాలు అన్నీ ఉంటాయి. వాటితోనే జీవితాలు సాగిపోతుంటాయి.
ఒక వ్యక్తి ఒక్కో వ్యక్తి లేదా సమాజంతో పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండటం పెద్ద విచిత్రమేమీ కాదు. ఇది మానవ నైజం. మనిషి వ్యక్తిత్వం ఇంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ఈ సంక్లిష్టతలే మనుషులను ఇతర జీవులకు భిన్నంగా నిలుపుతున్నాయని చెప్పవచ్చు. కానీ ఈ సంక్లిష్టతలు సమస్యలు సృష్టిస్తేనే సమస్య!







