కీలక సమయంలో సైలెంట్ అయిన వైస్సార్ పిల్ల..!

YS Sharmila

ఈడపిల్ల, ఆడపిల్ల అంటూ అటు తెలంగాణ రాజకీయాలలో ఇటు ఏపీ రాజకీయాలలో తన ప్రసంగాలతో మీడియా కు కావాల్సినంత ఆహారం అందించిన వైస్సార్ పిల్ల వైస్ షర్మిల 2014 నుంచి 2019 వరకు పుట్టింటి రాజకీయాలను చక్కదిద్ది 2021 నుండి 2024 వరకు అత్తంటి రాజకీయాలు చూసి తిరిగి పుట్టింటి గూటికి చేరింది.

అయితే కాంగ్రెస్ పార్టీ తరుపున పుట్టింటికి వచ్చి రాగానే అన్న జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడి అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇటు సోషల్ మీడియాకు కావలసినంత విందు భోజనం అందించారు షర్మిల. వైసీపీ గెలుపు లో తన పాత్రను వివరిస్తూ అదే వైసీపీ పతనానికి తన వంతు కృషిని తెలియచేస్తూ సాగిన షర్మిల ప్రసంగాలు వైకాపా నాయకులను
రాజకీయంగా ఇరుకునపెట్టాయి.

ADVERTISEMENT

సొంత అన్నకు వ్యతిరేకంగా రాజకీయం చేయడానికి సిద్ధపడిన షర్మిల…జగన్ ను ఇరుకునపెట్టనికి చూస్తున్న ప్రతిపక్ష పార్టీలకు ఒక ఆయుధం లా దొరికిందనే చెప్పాలి. షర్మిలకు తోడుగా వివేకా కుమార్తె సునీతా కూడా తన గళం విప్పడంతో చెల్లెళ్ళే జగన్ రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతున్నారా అనే అనుమానాలు కూడా కలిగాయి. తన తండ్రి వైస్సార్ తో జగన్ ను పోలుస్తూ వైస్సార్ కు జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడింది.

సొంత చిన్నాన్న హత్యకు న్యాయం చేయలేని జగన్ ఇక రాష్ట్రానికి ఏంచేస్తాడు..? సొంత చెల్లెళ్ళ పై తన కాలకేయ సైన్యంతో వ్యక్తిగత విమర్శలకు దిగిన జగన్ అన్న ఇక రాష్ట్రంలోని ఆడపడుచులకు ఎలా భద్రతా కల్పిస్తారు..? రాజకీయ పదవుల కోసం సొంత కుటుంబాలను దూరం చేసుకున్న జగన్ అన్న ఇక పేద కుటుంబాల గురించి ఆలోచిస్తాడా..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువత కు మెగా డీఎస్సి ఇస్తానంటూ అధికారం రాగానే దగా డీఎస్సి ఇచ్చాడు.

ప్రత్యేక హోదా కోసం ఎవరి మెడలు వంచుతానన్నాడో వారి దగ్గరే మెడలు వంచి మోకరిల్లి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టాడు. అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం మీద కొట్టాడు. పాలస్ లో కూర్చున్నవాడికి పేదల బతుకులు ఎలా తెలుస్తాయి అంటూ జగన్ మీద అలుపెరుగని విమర్శలు చేసిన షర్మిల కాంగ్రెస్ పార్టీ తరుపున విశాఖ హుక్కు కోసం ఏర్పాటు చేసిన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ముఖ్య అతిధిగా ఆహ్వానించి ఇక అన్న మీద యుద్దానికి సై అంటూ పిలుపునిచ్చి కాంగ్రెస్ పార్టీ కి ఊపిరి పోసి ఒక్కసారిగా సైలెంట్ అయ్యిపోయారు.

ఎన్నికలకు ఇంకా 45 రోజుల గడువే మిగిలి ఉన్న ఈ నేపథ్యంలో షర్మిల అనూహ్యంగా ఏపీ రాజకీయాల నుండి కనుమరుగయ్యారు. జగన్ మేమంతా సిద్ధం ప్రారంభ కార్యక్రమానికి తల్లి విజయలక్ష్మిని తెర మీదకు తెచ్చిన జగన్ చెల్లి షర్మిలకు చెక్ పెట్టగలిగాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే అత్తారిల్లు…పుట్టిల్లు అంటూ నిలకడ లేని రాజకీయాలు చేసిన షర్మిల ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు.

ఇప్పుడు కూడా అదే ధోరణితో తెలంగాణ మాదిరే ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పోటీ నుంచి తప్పుకుని మద్దతు అంటూ ఏదోఒక పార్టీ వైపు నిలబడతా..? అనే అపోహలు ఊపందుకున్నాయి. నమ్మిన కాంగ్రెస్ జెండా పట్టుకుని నిలబడతారా..? లేక నమ్ముకున్న వారి కోసం జెండా మారుస్తారా..? అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే సమాధానమే మిగులుతుంది. ఇప్పటికే తల్లి విజయలక్ష్మిని తనకు అనుకూలంగా చేసుకున్న జగన్ తన రాజకీయ పదవులు కాపాడుకోవడానికి చెల్లి షర్మిలను తన వైపు తిప్పుకోలేరా..? అనే ప్రశ్నకు జగన్ రాజకీయాన్ని క్షుణ్ణంగా గమనించిన వారికీ ఇట్టే సమాధానం దొరుకుతుంది.

ADVERTISEMENT
Latest Stories