ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలకన్నా రాజకీయ నేతల ఎన్నికల ప్రచారంలో వస్తున్న ఉక్కపోతలతో అల్లాడుతున్నారు రాష్ట్ర ప్రజానీకం. ఒకపక్క పార్టీల అథినేతలు పార్టీ ప్రచారాలతో బిజీగా ఉన్న తరుణంలో ఆ నేతల సతీమణులు భర్తలకు అండగా నిలవడానికి ఎన్నికల కురుక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు.
ఒక పక్క ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమంలో పాల్గొంటుంటే ఆయన సతీమణి భారతి జగన్ పోటీ చేయబోతున్న పులివెందులలో ప్రచార బాధ్యతలను చేపట్టారు. అలాగే టీడీపీ అధినేత కూటమి గెలుపు బాధ్యతను నెత్తెన వేసుకుని ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారంలో బిజిబిజీ గా గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలో నిన్న కుప్పం నియోజకవర్గంలో బాబు కు బదులుగా భువనేశ్వరి చంద్రబాబు తరుపున నామినేషన్ దాఖలు చేసారు. బాబు నామినేషన్ పత్రాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భువనేశ్వరి కుప్పం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబు తరుపున నామినేషన్ సమర్పించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. అలాగే కుప్పం నుండి బాబుని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కుప్పం ప్రజలను కోరుకున్నారు భువనేశ్వరి.
ఈ రోజు లోకేష్ కోసం మంగళగిరి ప్రచారానికి విచ్చేసారు నారా బ్రాహ్మణి. ఎంతో ఆప్యాయంగా అందరిని పలకరిస్తూ , స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి త్వరలోనే చర్యలు చేపడతాం అంటూ హామీలు ఇస్తూ తన భర్త గెలుపు కోసం తన వంతు సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు నారా బ్రాహ్మణి. గత ఎన్నికలలో కూడా లోకేష్ తరుపున మంగళగిరిలో ప్రచారం చేపట్టారు బ్రాహ్మణి. ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగించారు.
మహిళా సాధికారతే టీడీపీ ప్రధమ లక్ష్యం, దాని కోసమే బాబు ఎప్పుడు తపన పడతారు అంటూ తన మామ చంద్రబాబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు బ్రాహ్మణి. ఆలాగే హిందూపూర్ లో నామినేషన్ కార్యక్రంలో తన సతీమణి వసుంధరతో కలిసి వచ్చారు నందమూరి బాలకృష్ణ. ఇలా ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అనే సామెతను నిజం చేస్తూ భర్తల గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఈ నారీమణులంతా.




