‘మా నమ్మకం, మా భవిష్యత్ నువ్వే’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హోరెత్తించిన వైసీపి ఆ తర్వాత సిద్ధం… మేమంతా సిద్ధం అంటూ హడావుడి చేసింది. తాజాగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ‘జగన్ కోసం సిద్ధం’ అనే ఫ్లెక్సీ బ్యానర్లు కనిపిస్తున్నాయి.
ఏ ప్రజానాయకుడైన నేను ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలు చేస్తున్నానని చెప్పుకుంటాడు. తమ కోసం పనిచేస్తారనే ప్రజలు ఎన్నుకుంటారు కూడా. కానీ వైసీపి పోస్టర్స్ చూస్తే ప్రజలకు జగన్ తప్ప వేరే దిక్కు లేదు కనుక ఆయననే ఎన్నుకోక తప్పదన్నట్లు సూచిస్తున్నట్లు ఉంటాయి. వైసీపి పోస్టర్లను చూస్తున్నప్పుడు ఎవరికైనా రెండు సందేహాలు కలుగుతాయి.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి జగన్ను ఎన్నుకోమని చెపుతున్నారా లేక ముఖ్యమంత్రిగా కొనసాగాలనే ఆయన కల నెరవేర్చుకోవడానికి తనను ఎన్నుకోమని అడుగుతున్నారా? అనే సందేహం కలుగుతుంది. ముఖ్యమంత్రి కావాలనే ఆయన కలను 2019లోనే ప్రజలు నెరవేర్చారు.
జగన్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయినా తన కోసం వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను సృష్టించుకున్నారు. ఆంధ్రులు గర్వించాల్సిన రాజధాని అమరావతిని భ్రమరావతి అంటూ అవహేళన చేశారు. ఎవరికీ కనబడని మూడు రాజధానులు సృష్టించారు. వాటిలో నుంచి మళ్ళీ ‘విశాఖ రాజధాని’ని సృష్టించి అర చేతిలో వైకుంఠం చూపారు.
కానీ కానీ 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించినా ప్రజలు ఏమి కోరుకొంటున్నారో వాటిని జగన్ నెరవేర్చలేకపోయారు. కనీసం తాను స్వయంగా కనిపెట్టిన ‘విశాఖ రాజధాని’ చేయలేకపోయారు. జగన్ ప్రభుత్వం వైఫల్యాల జాబితాలో పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన వగైరా చాలానే ఉన్నాయని అందరికీ తెలుసు.
అయినా నన్నే గుడ్డిగా నమ్మండి… నేను మీ భవిష్యత్ మార్చేస్తానని ప్రజలను చెప్పుకోవడం ఆయనకే చెల్లునేమో? అంటే ప్రజలకు విచక్షణా జ్ఞానం లేదని అనుకొంటున్నట్లు కనిపిస్తుంది. కనుక ఉందని నిరూపించుకునే బాధ్యత ప్రజలదే.
నమ్మకం నుంచి సిద్దం వరకు వైసీపి పోస్టర్స్ చూసినప్పుడు ఎవరికైనా వైసీపి అంటే జగన్ ఒక్కరేనా? జగన్ తప్ప మరెవరికీ ఆ పార్టీలో విలువ లేదా?అని అనిపించకమానదు.
నేడు ప్రాంతీయ పార్టీలే కాదు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలలో కూడా అధినేత పూజ, భజనకు అలవాటు పడిపోయాయి. కనుక వైసీపి ఇందుకు మినహాయింపు కాదు కనుక జగన్ ఫోటోతోనే మళ్ళీ ఎన్నికలకు వెళుతున్నట్లు సర్ధిచెప్పుకోవచ్చు.
అయితే వారు జగన్ పేరు చెప్పుకొని, జగన్ ఫోటో చూపించి ప్రజలను ఓట్లు అడుగుతున్నారు కనుక సంక్షేమ పధకాలతో కలిగే ‘మేలు’తో పాటు మూడు రాజధానులు వంటి అనాలోచిత నిర్ణయాలు, ప్రతిపక్షాలను వేధించి వేటాడాలనే ఆయన ఆలోచనలకు వారు కూడా మూల్యం చెల్లించక తప్పదు.
ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, నిరుద్యోగులు తదితర వర్గాల ప్రజలకు జగన్ వలన కలిగిన కీడు ప్రభావం వైసీపి అభ్యర్ధులు అందరిపై ఉంటుంది.
5 ఏళ్ళ పాలన తర్వాత కూడా వైసీపిలో ఎవరూ తాము ప్రజలకు చేసిందేమిటో చెప్పుకోలేకపోతున్నారు. కనుక వారే తమ అధినేతని నిలదీసి ‘మాకెందుకు ఈ దుస్థితి కల్పించావు జగన్?’ అని అడగాల్సి ఉంది. కానీ జగన్ ఫోటోని చూపి ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. అంటే తామందరం అసమర్ధులమని స్వయంగా చాటింపు వేసుకొంటున్నట్లేగా? అటువంటి అభ్యర్ధులను గెలిపించాల్సిన అవసరం ఉందా? ప్రజలే ఆలోచించాలి.






