సూపర్ స్టార్ డంగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చినా, పవన్ కళ్యాణ్ కు తెలుగు ఇండస్ట్రీ నుండి ఏ మాత్రం సహకారం అందని విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికలలో అయితే అలీ, పృథ్వి, రచయిత చిన్నికృష్ణల ద్వారా విమర్శలు చేయించి, మొత్తం సినీ ఇండస్ట్రీనే పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకం అన్న భావన కల్పించడంలో ఓ విధంగా జగన్ మోహన్ రెడ్డి విజయవంతం అయ్యారు.
కానీ ప్రస్తుతం పరిస్థితులు తారుమారైనట్లుగా కనపడుతోంది. రాజకీయ చదరంగంలో భాగంగా ప్రస్తుతం ఏపీలో వైసీపీ అనుకూల పరిస్థితులు లేవన్న సర్వేల ఫలితాలో లేక రాజకీయ అవసరాల కోసం జగన్ వాడుకుని వదిలేశారని గమనించారో ఏమో గానీ, గతంలో మాదిరి ఇండస్ట్రీలో వ్యతిరేక భావన కాకుండా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు సహకారం అందించే విధంగా పలువురు మీడియా ముందుకొచ్చారు.
గతంలో తీవ్ర విమర్శలు చేసిన పృథ్వి అయితే ఏకంగా జనసేన జెండా పట్టుకుని ఇప్పటికే కదనరంగంలోకి దూకగా, వర్తమాన నటుడు నవదీప్ నేడు బహిరంగంగా పవన్ కు మద్దతు పలికారు. సినీ ప్రమోషన్ లో భాగంగా పిఠాపురం వెళ్లిన నవదీప్, ఈ సందర్భంగా అవసరమైతే పవన్ తరపున ప్రచారం చేయడానికి “సిద్ధమేనని” అన్నారు.
ఒక్క నవదీప్ మాత్రమే కాదు, వర్ధమాన నటులు హైపర్ ఆది, అనసూయ, జానీ మాస్టర్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ తదితరులు మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ కు తమ మద్దతును గతంలోనూ, తాజాగా ప్రకటిస్తున్నారు. దీని వలన జనసేనకు ఎంతవరకు లబ్ది పొందుతుందో పక్కన పెడితే, ఈ సారి వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి రాదు కాబట్టే, వీరంతా బయటకు వచ్చి మద్దతునిస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉంటే, సొంత కుటుంబం నుండి కూడా జనసేనకు మద్దతు లేదు అన్న విమర్శలను, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి 5 కోట్లు విరాళం ఇవ్వడం ద్వారా తొలగించినట్లయ్యింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ స్వయంగా ముందుకు రావడంతో, పవన్ వెనుక ఇండస్ట్రీ అంతా ఉందన్న సంకేతాలు పంపారా? అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
అంతేగాక 2019లో వైసీపీకి సానుకూలంగా మాట్లాడిన ‘మోహన్ బాబు అండ్’కో కూడా ప్రస్తుతం మౌనం వహించడం కూడా వైసీపీ వ్యతిరేక పవనాలేనని సినీ రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోన్న మాటలు. ఓ వైపు వైసీపీకి ఇండస్ట్రీ నుండి సహకారం అందకపోవడం, మరోవైపు వర్ధమాన నటులు జనసేనకు మద్దతు పలకడం స్వాగతించ పరిణామమే.




