ఎన్నికల గంట మ్రోగింది… ఏపీలో పరిస్థితి ఏమిటి?

Jagan CBN PK

ఏపీ శాసనసభ ఎన్నికలకు, నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలకు కొద్ది సేపటి క్రితం నోటిఫికేషన్‌ వెలువడింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచే నామినేషన్స్‌ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 25వరకు గడువు ఉంది.

నాలుగో దశలో ఏపీలో 175 శాసనసభ, 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ, ఒక శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. రెండు రాష్ట్రాలలో ఒకేసారి మే 13న పోలింగ్‌ జరుగబోతోంది. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి వెంట వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.

ADVERTISEMENT

గత రెండు ఎన్నికలకు భిన్నంగా ఈసారి వైసీపి-టిడిపి, జనసేన, బీజేపీలు సరిసమాన ఉజ్జీలుగా నిలవడంతో వాటి మద్య హోరాహోరీ పోరు జరుగబోతోంది. ఈ ఎన్నికలలో వైసీపి లేదా కూటమి ఏది ఓడిపోయినా వాటికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఓటమి వలన కలిగే నష్టం కంటే, రాజకీయ కక్షల వలన కలిగే నష్టమే ఎక్కువగా ఉండబోతోందని ఇప్పటికే స్పష్టమవుతోంది.

ఓడిపోయే పార్టీ ఏదైనా సరే రాష్ట్రంలో మనుగడ సాగించలేని పరిస్థితి ఎదురవవచ్చు. ఈవిషయం వైసీపి, టిడిపి, జనసేన మూడు పార్టీల నేతలకు బాగా తెలుసు కనుక గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు.

కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కనుక ఏపీలో బీజేపీ ఓడిపోయినా ఆ పార్టీపై పెద్దగా ప్రభావం చూపదు. కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలిచే అవకాశం లేదు. గత పదేళ్ళుగా ‘స్లీప్ మోడ్’లో ఉంది కనుక ఎన్నికలలో ఓడిపోయినా ఆ పార్టీకి కొత్తగా జరిగే నష్టం ఏమీ ఉండదు.

కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ, 4-5 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నా ఆ క్రెడిట్ వైఎస్ షర్మిలకే దక్కుతుంది. కనుక ఎన్నికల తర్వాత ఆమె ఏపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొనేందుకు వీలు కలుగుతుంది.

గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో వైసీపి అధికారంలో ఉంది కనుక చాలా బలపడింది. ముఖ్యంగా వాటి నేతలు ఆర్ధికంగా, రాజకీయంగా చాలా బలపడ్డారు. ఇదీగాక ప్రస్తుతం వైసీపి ఆధీనంలోనే రాష్ట్రంలోని యావత్ యంత్రాంగం ఉంది. సంక్షేమ పధకాలతో వైసీపి రాష్ట్రంలో పెద్ద ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకొంది.

ఇవన్నీ వైసీపికి కలిసి వచ్చే అంశాలు కాగా, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలలో వైసీపి పాలన, ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉండటం, టిడిపి, జనసేన, బీజేపీలు కలిసి కట్టుగా పోటీ చేస్తుండటం వైసీపిని దెబ్బ తీసే అవకాశం ఉంది.

టిడిపి, జనసేన, బీజేపీల కూటమిపై మొదట అనేక సందేహాలు నెలకొన్నప్పటికీ, మూడు పార్టీలు సీట్లు సర్దుబాట్లు చేసుకొని కలిసి పనిచేస్తుండటం వలన ప్రజలలో వాటి పట్ల నమ్మకం ఏర్పడింది. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటం కూడా కూటమికి కలిసి వచ్చే అంశమే.

మళ్ళీ మోడీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని రాష్ట్రాభివృద్ధి జరిగే అవకాశం ఉంది. కనుక ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వైసీపి గట్టి పోటీ ఇస్తున్నందున ఈసారి ఎవరికెన్ని సీట్లు లభిస్తాయనేది సస్పెన్స్.

ADVERTISEMENT
Latest Stories