పార్టీ అధినేతగా ఉంటూ పోటీ చేసిన రెండు స్థానాలలో ఓడిపోయావు…కనీసం పార్టీ నుండి పట్టుమని పదిమంది ఎమ్మెల్యే లను గెలిపించుకోలేక పోయావు…గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే ను కూడా నిలబెట్టుకోలేక పోయావు….నీకు రాజకీయాలు అవసరమా…? వెళ్లి సినిమాలు తీసుకో అంటూ గత ఎన్నికల ఫలితాల తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి యావత్ వైసీపీ కుటుంబం మొత్తం చేసిన అవహేళన ఇది.
2019 ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల వరకు జనసేన పోటీ చేసిన ఏ ఒక్క పోటీలో కూడా పార్టీ అనుకున్నంతగా రాణించలేకపోయింది. పవన్ సభలు పెడితే వచ్చే లక్షలాది అభిమాన గణం పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు..? రాజకీయ సభలకు వచ్చి పవన్ చేసే ప్రసంగం ఏమిటో కూడా వినకుండా…పట్టించుకోకుండా సీఎం, సీఎం అంటూ నినాదాలు చేసి చివరికి పోటీ చేస్తే కనీసం పవన్ కూడా గెలిపించుకోలేకపోయారు.
గత ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన దాదాపుగా 130 కు పైచిలుకు స్థానాలలో తమ అభ్యర్థులను పోటీలో ఉంచితే కేవలం రాజోలు ప్రాంతంలో మాత్రమే జనసేన విజయ బాగుట ఎగరవేయగలిగింది. అసలు ఆ 130 స్థానాలలో కూడా పవన్, నాదెండ్ల, మాజీ సిబిఐ డైరెక్టర్ జెడి లక్ష్మి నారాయణ, నాగబాబు తాడేపల్లి గూడెం బొలిశెట్టి శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్, కాకినాడ పంతం నానాజీ ఇలా …పట్టుమని పదిమంది నాయకుల పేర్లు మాత్రమే జనసేన తరుపున సుమరిచితమైవి.
ఇప్పటికి టక్కున జనసేన పార్టీ నాయకుల పేర్లు ఒక పది చెప్పమంటే జేడీ ని మినహాయించి మిగిలిన ఆ నేతల పేర్లు మాత్రమే చెప్పగలరు జనసైనికులు కూడా. గడిచిన ఐదేళ్లుగా పార్టీ తరుపున బలమైన నాయకులను తయారు చేయకుండా ఎన్నికల ముందు మాత్రం 24 కాదు 64 అంటూ ఒకరు, 24 కాదు 44 అంటూ మరొకరు, ఎన్ని సీట్లిచ్చినా పర్లేదు రెండేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇస్తే చాలు అంటూ ఇంకొందరు ఇలా ఒక పార్టీ తరపునే ఇన్ని ఛాయిస్ లు ఇస్తూ పక్క పార్టీ పై నిందలు వేయడం న్యాయమా..?
పార్టీ అధినేత ఏమో ఈ సారి ప్రత్యర్థి పార్టీకి అసలు ఛాయిసే ఇవ్వకూడదు అంటు ముందుకొస్తుంటే పార్టీ క్యాడర్ మాత్రం ఎవరో చేస్తున్న రెచ్చగొట్టు విమర్శలు చూస్తూ ఇలా రెచ్చిపోవడం ఎంతవరకు సమంజసం…? గత ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయావు, అసలు నీకు నీ పార్టీకి అంత సీన్ లేదు…నువ్వు రాజకీయాలకు సరిపోవు అంటూ కించపరుస్తూ ఒక పక్క.., దమ్ముంటే ఒంటరిగా పోటీ చెయ్యి.
నిన్ను నమ్మి నీ పార్టీ కోసం పనిచేస్తున్న జనసైనికులను, జనసేన ఓటు బ్యాంకును టీడీపీ కి తాకట్టు పెట్టు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మరో పక్క తన రాజకీయ అవసరానికి మార్గాన్ని సులభం చేసుకుంటున్నారు వైసీపీ నాయకులు. తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా పవన్ ఇదే తరహా ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈసారి పోటీ నుంచి తప్పుకుందాం అనుకున్న పవన్ పై పార్టీ నేతలు, పవన్ అభిమానులు మేమున్నాం .. చూసుకుందాం…పదా అంటూ ముందడుగు వేపించారు.
వారిని నమ్మి ముందుకెళ్లిన జనసేన పరిస్థితి తెలంగాణలో ఏమయిందో జనసైనికులు గుర్తుచేసుకోవాలి. పార్టీ సంస్థాగతంగా బలపడనంత వరకు సభలకు వచ్చిన జనాలను చూసో, ప్రత్యర్థి పార్టీ నాయకుల విమర్శలను వినో పోటీకి రెడీ అంటూ రెచ్చిపోతే మరోసారి అవమానాలను ఎదుర్కోవడానికి పవన్ సిద్దమయినట్టే. సీఎం..సీఎం అంటూ గొంతులు పోయేలా అరిచే ఓటు వేయని అభిమానం పార్టీకి, పవన్ కు అవసరమా..?
‘రెచ్చకొట్టడం వైసీపీ నైజం అయినప్పటికీ…రెచ్చిపోవడం జనసేన బలహీనత కాకూడదు’. ఒకప్పుడు ఇదే నీ స్టామినా అంటూ రెచ్చిపోయిన వైసీపీ…ఇప్పుడు ఇదేనా నీ బలం అంటూ రెచ్చకొట్టడానికి ప్రయత్నిస్తుంది అంటేనే అర్ధమవుతుంది రెచ్చకొట్టడం వైసీపీ కి ఎంత అనివార్యమో. ఎన్నికల ప్రచారానికి ఉన్న సమయం తక్కువ. ఇటువంటి సందర్భాలలో టీడీపీ, జనసేన ఏ ఒక్కరు తప్పటడుగు వేసినా ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, అధికారం అనే మాటున కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ నాయకులు.




