వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిన ప్రతీసారి ఆయన ఏదో సాకుతో విచారణకు హాజరుకాకుండా తప్పించుకొంటూ, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తూ కేసును అంగుళం ముందుకు కదలనీయకుండా చేస్తున్నారు. చాలారోజులుగా ఇలాగే జరుగుతున్నప్పటికీ, సీబీఐ మాత్రం ఎప్పటికప్పుడు కొత్త నోటీసులతో విచారణకు ఆహ్వానిస్తూనే ఉంది తప్ప సరైన చర్యలు తీసుకోవడంలేదనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారం అవినాష్ రెడ్డి శక్తిసామర్ధ్యాలకు, సీబీఐ నిసహాయతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని భావించవచ్చు.
నాలుగేళ్ళుగా ఈ కేసు విచారణ ముందుకు సాగనందుకు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ని తొలగించి ఆయన స్థానంలో కెఆర్ చౌరాసియాని నియమించింది. ఈ కేసు విచారణను జూన్ నెలాఖరులోగా పూర్తిచేసి, వివేకా హంతకులు ఎవరో నిర్ధారించాలని సుప్రీంకోర్టు గడువు కూడా విధించింది.
అయితే అవినాష్ రెడ్డిని విచారణకు రప్పించేందుకే సీబీఐ ఇన్ని ఆపసోపాలు పడుతున్నప్పుడు, విచారణకు హాజరైనా ఆయన తమకు సహకరించడం లేదని హైకోర్టులో మొత్తుకొంటున్నప్పుడు, గడువులోగా ఈ కేసు విచారణను ఏవిదంగా పూర్తి చేయగలదు?అనే సందేహం కలగడం సహజం.
ఈ కేసులో అవినాష్ రెడ్డి చాలా చిన్న చేప అని, ఆ చిన్న చేపే సీబీఐని ఇన్ని ముప్పతిప్పలు పెడుతున్నప్పుడు, ఈ కేసులో ఆయన కంటే పెద్ద తిమింగలాలను ఏవిదంగా పట్టుకోగలదని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. అసలు వివేకా హత్యకు వాడిన గొడ్డలి లేదా మారణాయుధాలు ఎక్కడ ఉన్నాయో సీబీఐ ఇంతవరకు కనుగొనలేనప్పుడు, ఈ కేసుని ఇంకా ఎప్పటికీ పరిష్కరిస్తుందని, అసలు పరిష్కరించగలదా లేదా? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు.
ఈ సందేహాలకు బహుశః సీబీఐ కూడా సమాధానాలు చెప్పలేదేమో?కానీ గడువు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టుకి ఏం సమాధానం చెప్పుకొంటుందో చూడాలి.
అయితే ఈ సీబీఐ, ఈడీ కేసులు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజకీయ అవసరాలను బట్టి మద్యలో వేగం పుంజుకోవడం లేదా తెలుగు డెయిలీ సీరియల్లాగా సాగుతుండటం, కొన్ని సందర్భాలలో మెల్లగా అటకెక్కిపోతుంటాయని అందరికీ తెలుసు. కనుక ఈ కేసు విచారణ జరుగుతున్న తీరు చూస్తున్నప్పుడు, బహుశః వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు ఇదేవిదంగా సాగుతుందేమో అనే సందేహం కలుగుతోంది. అప్పుడు బిజెపి అవసరాలను బట్టి ఈ కేసు సంగతి తేలిపోవచ్చు.
చందమామ కధలో పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజం వేసుకొని మళ్ళీ బయలుదేరిన్నట్లు, సీబీఐ కూడా మళ్ళీ ఎప్పటిలాగే అవినాష్ రెడ్డికి సోమవారం విచారణకు హాజరుకావాలని మరో నోటీస్ పంపింది. అప్పుడు వివేకా కేసులో భేతాళుడు మళ్ళీ ఏం కొత్త కధ చెపుతాడో వినాల్సిందే!



