అవినాష్ ఇప్పుడు చెప్పేవి నిజాలైతే…అప్పుడు నిందలు అవాస్తవాలా..?

ys-avinash-reddy

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డి కడప వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యంలో ఆయన మీద రాజకీయ యుద్దానికి సిద్ధమయ్యారు ఆయన సోదరీమణులు సునీత, షర్మిల. అయితే ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా షర్మిల ఎన్నికల కదనరంగంలోకి దిగితే ఆమెకు మద్దతుగా వివేకా కుమార్తె సునీత పరోక్షంగా అవినాష్ పై పోరాటం చేస్తున్నారు.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో అక్కచెల్లెళ్ళిద్దరు అవినాష్ పై విమర్శలు ఎక్కిపెట్టి వైస్సార్ బిడ్డ వైపు ఉంటారా..? వివేకాను చంపిన హంతకుడికి మద్దతిస్తారా..? అంటూ కడప లో ప్రతి గడప తడుతున్నారు. ఒకానొక సందర్భంలో సునీత, షర్మిల విమర్శల దెబ్బకి వైసీపీ కడప అభ్యర్థి మార్పు అంటూ ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. జగన్ కూడా చెల్లెళ్ళిద్దరిని కట్టడి చేయడానికి ఆ కుటుంబం నుంచే వైస్సార్ సోదరి విమలను తమకు అనుకూలంగా మీడియా ముందుకు తెచ్చారు.

జగన్ ఒక అడుగు వేస్తే సునీత, షర్మిల రెండగులు ముందుకు వేస్తూ ఎప్పటికప్పుడు అవినాష్ రెడ్డికి చెక్ పెడుతూనే వస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సునీత వివేకా హత్య సమయంలో అవినాష్ కాల్ డేటా, ఆయన ఆ సమయంలో అక్కడే ఉన్నట్లు గూగుల్ మ్యాప్లో చూపించిన ఆధారాలు అన్నిబయటపెట్టారు. అలాగే అవినాష్ రెడ్డి పైన, ముఖ్యమంత్రి జగన్ పైన కూడా పలు ప్రశ్నలు సంధించింది.

సునీత వాదన రాష్ట్ర ప్రజలలోకి బలంగా వెళుతుందని గ్రహించిన జగన్ అండ్ కో దానికి తగిన దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. వివేకా హత్య జరిగిన ఇన్నాళ్లుగా ఏనాడూ మీడియా ముందుకు రాని అవినాష్ తన పై తన సోదరి తప్పుడు ఆరోపణలు చేస్తుందని, ఆమె మాటలో వాస్తవము లేదని ప్రజలు ఆమె మాటలు నమ్మాల్సిన అవసరం లేదని, తనకు వివేకా హత్యకు ఎటువంటి సంబంధం లేదంటూ తనవాదన వినిపించారు.

వివేకా హత్య జరిగినప్పుడు ఆ సమాచారం పోలీసులకు ఇచ్చింది తానేనని, ఆయనకు గుండెపోటు అనేది కూడా ఎవరో చెప్పమంటే చెప్పానని, అలాగే రక్తం మరకలు కూడా తానూ శుభ్రం చేయలేదని చెప్పుకొచ్చారు. అయినా సునీత కూడా అప్పుడు తన పై ఈ ఆరోపణలు చేయలేదని, బాబు, ABN రాధాకృష చెప్పిన తప్పుడు మాటలు విని ఇలా ప్రవర్తిస్తుందన్నారు. అసలు వివేకా చనిపోయే రెండు సంవత్సరాలముందు నుంచి ఆయన ఎంతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారని, ఆసమయంలో వివేకాను ఒంటరిని చేసి ఆయన పట్ల కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించింది సునీత అంటూ సునీత పై నెపం నెట్టే ప్రయత్నం చేసారు.

అలాగే వివేకా సిగిరెట్లకు, మద్యానికి బానిసగా తయారయ్యి తన ఇంటిలోనే అనేక సార్లు పడిపోయారని, ఆ సమయంలో ఇంటి పనివాళ్ళు ఆయనను జాగ్రత్తగా చూసుకున్నారని, వివేకాకు రెండో భార్య ఉందని, ఆమె కు, ఆమె కొడుకుకు ఆస్తి పంపకం కోసం వివేకా ప్రయత్నించారని, దానిని సునీత కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించారని, ఆయన చావుకి సునీత కూడా ఒకకారణమే అనేవిధంగా మీడియా ముందు తన వాదన వినిపించారు.

అయితే హత్యకు పరోక్షంగా కుటుంబ తగాదాలే కారణమంటూ ఈనాడు చెప్పిన అవినాష్ మరి 2019 ఎన్నికల నాటి నుండి నిన్న మొన్న వరకు ఇందులో చంద్రబాబు ప్రమేయం ఉందని, నారాసుర రక్తచరిత్ర అంటూ సాక్షిలో వేసిన కథనాలు, బాబు పై జగన్ వేసిన నిందలు అన్ని అవాస్తవలే అని ఒప్పుకున్నట్లేనా..? అంటే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను దెబ్బ తీయడం కోసం విలువలకు తిరోధకాలిచ్చి శవరాజకీయాలు నడిపింది ఎవరు..?

ADVERTISEMENT
Latest Stories