జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి చేయడాన్ని ప్రధాని నరేంద్రమోడీ, పొరుగు రాష్ట్రంలోని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తదితరులు ఖండించినప్పుడు, జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్, సిట్టింగ్ ఎంపీ, మళ్ళీ కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డికి మాట్లాడే హక్కు, బాధ్యతా ఉండవా? అంటే ఉంటాయనే చెప్పవచ్చు.
“జగన్ బస్సు యాత్రలకు జనం బ్రహ్మరధం పడుతుండటంతో, కొందరు అసూయతో రగిలిపోతున్నారు. వారే ఈ దాడి చేయించి ఉంటారని భావిస్తున్నాను. అది రాయా, గాజు ముక్కా మరొకటా అనేది విచారణలో తెలుస్తుంది. కానీ దాడి జరిగిన సమయం, ఆ రాయి లేదా మరొకటి వచ్చిన యాంగిల్ చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి హాని చేయాలనే ప్రయత్నించిన్నట్లు స్పష్టం అవుతోంది.
అది నుదుటన తగిలింది కానీ పొరపాటున ఒక్క ఇంచి క్రిందన తగిలితే ఏమయ్యేదో ఊహించుకోవడానికే భయం వేస్తోంది. దీనిపై పోలీసులు విచారణ జరిపి దాడి చేసిన వ్యక్తిని, వెనుకున్న వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలని నేను కోరుతున్నాను,” అని అవినాష్ రెడ్డి అన్నారు.
సీబీఐ కూడా ఆయనే ఏ-1 అని చెపుతోంది. వైఎస్ షర్మిల, సునీతా రెడ్డి ఇద్దరూ వివేకా హత్య కేసులో ఆయననే వేలెత్తి చూపిస్తున్నారు. ఆయన జైలుకి వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డే కాపాడుతున్నారని ఇద్దరూ ఆరోపిస్తున్నారు.
తమ సొంత కుటుంబంలోనే ఓ పెద్దాయనని అత్యంత దారుణంగా హత్యకు గురైతే, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ హంతకులను వెంటనే పట్టించే ప్రయత్నం చేయకుండా మళ్ళీ అవినాష్ రెడ్డికే ఎందుకు టికెట్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.
సొంత బాబాయ్, సొంత చెల్లిని కాదని అవినాష్ రెడ్డిని ఇంతగా ఎందుకు వెనకేసుకువస్తున్నారని నిలదీస్తున్నారు. వారి ప్రశ్నలకు ఆరోపణలకు జగన్, అవినాష్ రెడ్డి ఇద్దరూ సమాధానాలు చెప్పడం లేదు. ఆ పెద్దాయన హత్య గురించి మాట్లాడని అవినాష్ రెడ్డి, జగన్పై రాయి దాడి గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వివేకాని గొడ్డలితో నరికి చంపడం కంటే ఈ రాయి దాడి చాలా తీవ్రమైనదన్న మాట!
ఎలాగూ వైసీపి, టిడిపి రెండు పార్టీలు దీనిపై విచారణ జరపాలని కోరుతూ ఈసీకి లేఖలు వ్రాశాయి కనుక ఎవరికీ అభ్యంతరం లేదు. కనుక తక్షణం ఈసీ చర్యలు చేపడితే బాగుంటుంది.




