ఎన్నికలలో పార్టీల జయాపజయాలు సర్వసాధారణం. ఒకప్పుడు కాంగ్రెస్ ఆ తర్వాత టిడిపిల హయాంలో ఎన్నికలలో ఓడిపోయిన పార్టీలు మళ్ళీ యధాప్రకారం రాజకీయాలు చేసుకోగలిగేవి.
కానీ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్, టిడిపిలని నామరూపాలు లేకుండా చేసి, ప్రతిపక్షాలను నిర్ధాక్షిణ్యంగా అణచివేయాలని ప్రయత్నించారు. కానీ చివరికి ఏమైందో అందరూ చూశారు.
ఏపీలో వైసీపి ప్రభుత్వం కూడా గత 5 ఏళ్ళుగా అంతకంటే చాలా చాలా ఎక్కువే చేస్తోంది. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలుచేస్తుండటంతో టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలు చాలా కష్టాలు అనుభవించారు. ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు.
కనుక ఈసారి ఎన్నికలలో తాము గెలిస్తే వైసీపిపై ఇంతకు ఇంతా రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని వారు చాలా కసితో రగిలిపోతున్నారు. ఇది మానవ సహజమే కానీ వారిని ఆవిదంగా ప్రేరేపించింది మాత్రం వైసీపి ప్రభుత్వమే. కనుక ఓడిపోతే దీని పర్యవసనాలను కూడా భరించక తప్పదు.
2019 ఎన్నికలలో వైసీపి భారీ మెజార్టీతో గెలిచి అధికారంలో వచ్చినందున ఈ 5 ఏళ్ళలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోయినా కేవలం సంక్షేమ పధకాలకే పరిమితమవుతూ, ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన సాగించి ఉండి ఉంటే, నేడు రాష్ట్రంలో ఇటువంటి అవాంఛనీయమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉండేదే కాదు. రేపు ఎన్నికలలో ఓడిపోయినా వైసీపి నేతలకు కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమస్యలు ఉండేవే కావు.
కానీ ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే గుడ్డి నమ్మకంతో కేసీఆర్ పెట్రేగిపోయి ఎదురు దెబ్బ తిన్నట్లే, జగన్ ధోరణి, విపరీత ఆలోచనలు కారణంగా ఎన్నికలలో వైసీపి కూడా ఓడిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఓడిపోతే జగన్ కారణంగానే ఆ పార్టీలో నేతలందరూ తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు.
అసలు ప్రజలు ఓ రాజకీయ పార్టీ లేదా కూటమిని ఎందుకు గెలిపించి అధికారం కట్టబెడతారు?అని ఆలోచిస్తే రాష్ట్రాన్ని లేదా దేశాన్ని పాలించమని, అభివృద్ధి చేసి తమ జీవన ప్రమాణాలు పెంచుతుందనే కదా? రాజకీయాలు చేసుకోమనో లేదా రాజకీయ కక్ష సాధింపులతో కాలక్షేపం చేయమనో కాదు కదా?
కానీ వైసీపి ప్రభుత్వం ప్రజాభీష్టాన్ని గమనించకుండా రాష్ట్ర రాజకీయాలలో ప్రతీకార విష సంస్కృతిని ప్రవేశపెట్టింది. రాష్ట్ర రాజకీయాలను ఇది చాలా కలుషితం చేస్తోంది కనుక ఇది వైసీపి చేసిన మరో పెద్ద తప్పని చెప్పక తప్పదు. రేపు వైసీపి లేదా కూటమి అధికారంలోకి వచ్చినా ఏ ప్రభుత్వమూ కూడా ఈ రాజకీయ కక్ష సాధింపులను కాదనలేని పరిస్థితి వైసీపి కల్పించిందని చెప్పక తప్పదు.
దీని వలన వైసీపి, ప్రతిపక్షాలలు మాత్రమే కాదు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజలు అందరూ కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుండటమే చాలా బాధాకరం. ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించమని భారీ మెజార్టీతో అధికారం కట్టబెడితే ఆ పనిచేయకపోగా భవిష్యత్ రాజకీయాలను కూడా ఈవిదంగా కలుషితం చేయడం దారుణమే కదా?




