ఏపీ రోడ్ల మీద ప్రయాణం అంటే వెన్నుపూసలు కదిలిపోవాల్సిందే అనే అంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల పై అనేక విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మేల్కొంది. ఈ నెల 10వ తేదీ నుంచి 45 రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
రూ.560 కోట్లతో రహదారుల మరమ్మతులకు సంబంధించి ఈ నెల 10వ తేదీలోగా టెండర్లు పూర్తి చేస్తామని, ఈ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సరే ఇంతటి కీలకమైన విషయం పై ఇప్పటికైనా ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు మంచిదే. కానీ ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చిత్రంగా ఉన్నాయి.
గత ప్రభుత్వంలో చివరి రెండేళ్లు రహదారుల మరమ్మతుల గురించి పట్టించుకోలేదని, మనం అధికారంలోకి వచ్చాక భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బ తిన్నాయని తెలిపారు. చంద్రబాబు హయం గురించి ఎవరికి ఎటువంటి అభిప్రాయం ఉన్నా ఆయన ప్రభుత్వంలో రోడ్లను పట్టించుకోలేదు అని చెప్పడం మాత్రం హాస్యాస్పదం.
ఒకవేళ నిజంగా నిర్లక్ష్యం చేశారు అనుకున్నా…. గత ప్రభుత్వంలోని రెండేళ్ళు పూర్తయ్యి ఇంకో రెండేళ్ళు అయిపోయాయి. నిర్లక్ష్యం చేశామని ముఖ్యమంత్రి ఒప్పుకోకపోవడం విశేషం ఏమీ కాదు కానీ ఇంకా గత ప్రభుత్వాన్ని నిందించడంలో అర్ధం లేదు. ఏది ఏమైనా రోడ్లను బాగుపరిస్తే అదే మహాప్రసాదం.



