ఏపీలో వైసీపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మొన్న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే వరకు పార్టీలో, ప్రభుత్వంలో, బడిలో, గుడిలో అంతటా కూడా ‘సర్వం జగన్మయం’ అన్నట్లు సాగింది. ఎక్కడ చూసినా జగన్ ఫోటోలు, భజనలే.
పార్టీ నేతలకే కాదు… రాష్ట్ర ప్రజలకు కూడా ‘నేనే దిక్కు… నేనే నమ్మకం… నేనే భవిష్యత్…’ అని స్టిక్కర్లు, పోస్టర్లు వేసుకొని మరీ జగన్ చాటింపు వేసుకున్నారు.
నిన్న మొన్నటి వరకు రాష్ట్రమంతా కరోనా వైరస్లా వ్యాపించిన ‘సిద్దం పోస్టర్లు, సభలు’ కూడా అలాగే సాగాయి. అన్నిటా జగన్ ఫోటోలే… ప్రతీ సభలో జగన్ ఒక్కరే ర్యాంప్ వాక్ చేసేవారు.
కానీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసరికి, జగన్ ఆలోచనావిధానం కూడా కాస్త మారిన్నట్లుంది. ఇంతకాలం తన ఫోటోతో ‘సిద్దం’ అని ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడు ‘మేమంతా సిద్దం’ అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను, పార్టీలో నాయకులను కలుపుకొని బస్సు యాత్రలకు సిద్దం అవుతున్నారు. అంటే ‘నేను మాత్రమే’ అనే పరిస్థితి నుంచి ‘మనం’ అనే స్థాయికి దిగారన్న మాట! బహుశః, చిలకలూరిపేటలో టిడిపి, జనసేన, బీజేపీల ప్రజాగళం సభ ఎఫక్టే అని భావించవచ్చు.
అదీగాక, అర్జునుడు ఎంత గొప్ప యోధుడే అయినా సైన్యం లేకుండా కురుక్షేత్ర యుద్ధం చేయలేదు. కనుక టిడిపి, జనసేన, బీజేపీల పద్మవ్యూహంలోకి ఒంటరిగా ప్రవేశిస్తే బలైపోతానని జగన్ అలియాస్ అర్జునుడు ముందే పసిగట్టారో ఏమో, ఇప్పుడు ‘మనం అందరం సిద్దం’ అంటూ వైసీపి మూకలను కూడా ఆ పద్మవ్యూహంలోకి తోలుకుపోతున్నట్లున్నారు.
ఈ నెల 27న ‘ఇడుపాలపాయ-ఫార్మాలిటీ’ పూర్తయిన తర్వాత పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాలలో జగన్ బస్సు యాత్ర చేయబోతున్నారు. ఆరోజు పొద్దుటూరు సభలో ఒకసారి ‘సిద్దం’ అని చెప్పుకున్నాక, 29,30 తేదీలలో నంద్యాల, కర్నూలు, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాలలో బస్సుయాత్రలు చేసి, ‘మేమంతా సిద్దం’ అని చెప్పబోతున్నారు.
రాష్ట్రంలో నాలుగు చోట్ల ‘సిద్దం సభలు’ నిర్వహించినప్పుడు వాటికి జనాలను తీసుకురావడానికి వైసీపి నేతలు ఎంతగా ఆపసోపాలు పడ్డారో వారికే తెలుసు. పైగా ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. కనుక ఇదివరకులా జనాలను సంక్షేమ పధకాలు కట్ చేస్తామని భయపెట్టి తీసుకురాలేరు. ఏపీఎస్ ఆర్టీసీ అధికారులను బెదిరించి ఆర్టీసీ బస్సులను పట్టుకుపోలేరు. కనుక మనమే ఓ రెండు మూడు బస్సులు వేసుకొని జనాల వద్దకు వెళితే సరిపోతుందని జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచనే చేశారని చెప్పవచ్చు.
ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా కంటే పార్టీ అధ్యక్షుడుగా రాజకీయాలు చేసుకోక తప్పదని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కుండ బద్దలు కొట్టిన్నట్లు చెప్పారు. కనుక జగన్ కూడా ఆయనను ఫాలో అయిపోతున్నట్లున్నారు.
కాకపోతే రేవంత్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఒకటే తేడా. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిస్తే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా మళ్ళీ పూర్తి అధికారాలు లభిస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు రెండో ఛాన్స్ ఇస్తేనే పదవీ, అధికారం దక్కుతాయి. అన్నిటికీ ‘సిద్దం’గానే ఉన్నామని ఫ్లెక్సీ బ్యానర్లు వేసుకొని చెపుతున్నారు కదా?




