ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు లేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశనిస్పృహలతో తల్లితండ్రులకు భారంగా ఉన్నామని బాధపడుతున్నారు. మరోపక్క వేలాదిమంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, పూణే, ముంబై నగరాలకు వలసలు పోతున్నారు. ప్రభుత్వం డీఎస్సీ తీస్తుందని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తుంటే, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు రెండేళ్ళు పెంచినందున పోస్టులు ఖాళీ కావడంలేదని, కనుక ఇప్పట్లో డీఎస్సీ తీయలేమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా శాసనసభలో చెప్పారు.
రాష్ట్రంలో పరిశ్రమలు లేక, ఉద్యోగాలు దొరక్క అల్లాడిపోతున్న నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని గత నాలుగేళ్లుగా ఆశగా ఎదురుచూస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఏటా సంక్షేమ పధకాల క్యాలండర్ విడుదల చేస్తుండటం విశేషం. మంగళవారం తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమాచార శాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఆ శాఖ కమీషనర్ టి. విజయకుమార్ రెడ్డిలతో కలిసి 202324 సంవత్సరాలకు సంక్షేమ పధకాల క్యాలండర్ విడుదల చేశారు.
దాని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి నెల వరకు ప్రతీనెల కనీసం ఒకటి లేదా రెండు పధకాలకు సిఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నిధులు విడుదల చేసేలా చాలా జాగ్రత్తగా ఈ సంక్షేమ క్యాలండర్ని రూపొందించారు.
ఈ నాలుగేళ్ళలో వైసీపీ ప్రభుత్వం రూ.2,96,148.09 కోట్లు సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు పంచిపెట్టామని మంత్రి చెల్లుబోయిన చెప్పారు. అంటే సగటున ఏడాదికి రూ.74,037 కోట్లు చొప్పున పంచిపెట్టింది కనుక రాబోయే 12 నెలల్లో మరో రూ.74,037 కోట్లు పంచిపెట్టబోతోందని భావించవచ్చు.
వైసీపీ ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం సంక్షేమ పధకాల పేరుతో నాలుగేళ్ళలో రూ.2,96,148.09 కోట్లు పంచిపెట్టేసింది. అయినా నేటికీ లబ్ధిదారులు సంక్షేమ పధకాల కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు! రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏటా ఈవిదంగా సంక్షేమ క్యాలండర్ ప్రకటించి మరీ డబ్బు పంచిపెడుతూనే ఉంది. అంటే ఈ పధకాలతో లబ్ధిదారుల జీవితాలలో ఎటువంటి మార్పు రాలేదనే కదా?
అదే… ఏటా ఇంత సొమ్మును అమరావతి నిర్మాణ పనులకో లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకో లేదా పరిశ్రమల స్థాపనకు లేదా మూతపడిన పరిశ్రమల పునరుద్దరణకు ఖర్చు చేసి ఉండి ఉంటే, రాష్ట్రంలో భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చి ఉండేవి. రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తి భారీగా పెరిగి రాష్ట్రం సస్యశ్యామలం అయ్యుండేది. మూతపడిన పరిశ్రమలు తెరుచుకొని ఉంటే వాటి ద్వారా నిరుద్యోగులకు భారీగా ఉద్యోగావకాశాలు వచ్చి ఉండేవి కదా?
రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితిని కళ్ళారా చూస్తున్నా కూడా వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలండర్ విడుదల చేయకుండా సంక్షేమ క్యాలండర్ విడుదల చేస్తోందంటే దాని ప్రాధాన్యత దేనికో అర్దం అవుతూనే ఉంది. అందుకే యువగళం పాదయాత్రలో టిడిపి యువనేత నారా లోకేష్ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని, మళ్ళీ ఎక్కడికక్కడ పరిశ్రమలు, ఐటి కంపెనీలను రప్పించి భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని గట్టిగా చెపుతున్నారు.



