తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కేసీఆర్ ప్రధాన కారణమని అందరికీ తెలుసు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు, అహంభావం, నిరంకుశపోకడలే బిఆర్ఎస్ కొంపముంచాయని రాజకీయ విశ్లేషకులు ఏకగ్రీవంగా తీర్మానించి చెప్పేశారు.
అచ్చం ఆయన లాగే వ్యవహరిస్తున్న ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి వలన కూడా ఎన్నికలలో వైసీపి ఇదేవిదంగా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ వారికి ‘ఎల్లో మీడియా’ ముద్రవేసి, జగన్మోహన్ రెడ్డిని, ఇప్పుడు ఎమ్మెల్యేల మాచాలానే నిర్ణయాన్ని వైసీపి నేతలు గట్టిగా సమర్ధించుకొంటున్నారు.
కేసీఆర్ పరిస్థితి చూసి, జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు సిద్దమవడం అంటే ఇంతవరకు అనుసరించిన విధానాలు, తీసుకొన్న నిర్ణయాలు తప్పు అని అంగీకరించిన్నట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను కొట్టి పారేయలేము.
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాలు, ఆలోచనలు, ప్రభుత్వ విధానాలు అన్నీ సవ్యంగా ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నట్లయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి ఇంత ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎప్పటిలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే ఎన్నికలకు వెళ్ళి 175 సీట్లు గెలుచుకొంటామని ధీమాగా చెప్పేవారు కదా?
ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలినప్పుడు కూడా నలుగురు ఎమ్మెల్యేలని బయటకు పంపేశారు కదా? ముఖ్యమంత్రి విధానాలకు, నిర్ణయాలకు, వైఫల్యాలకి తన ఎమ్మెల్యేలను బలిపశువులు చేస్తున్నారని సిపిఐ నారాయణ వంటివారు చెపుతున్న మాటలు, వైసీపి నేతల మనసులో మాటలే అనుకోవచ్చు.
జగన్ ఏ ఉద్దేశ్యంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని అనుకొన్నప్పటికీ, దీంతో వైసీపి నేతలలో అభద్రతాభావం మరింత పెరిగితే మొదలుపెడితే నష్టపోయేది వైసీపియే. ఇందుకు తాజా ఉదాహరణలుగా ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తిప్పల నాగిరెడ్డి , దేవన్ రెడ్డి తదితరులు కళ్లెదుటే ఉన్నారు.
ఇంతకాలం 175 సీట్లు మేమే గెలుచుకొంటామని పదేపదే చెపుతూ, ఎన్నికలకు మూడు నెలల ముందు ఎమ్మెల్యేలను, నియోజకవర్గం ఇన్చార్జిలను మార్చడం ద్వారా ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు పంపించిన్నట్లవుతోందని జగన్ గ్రహించిన్నట్లు లేదు. ఎన్నికలకు ముందు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కేసులలో ఇరికించి జైల్లో వేస్తే అవలీలగా ఎన్నికలలో గెలవచ్చని భావించారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు వైసీపి అధినేత తడబాటుతో టిడిపి, జనసేనలకు సానుకూల వాతావరణం కల్పించిన్నట్లయింది కదా?
ఎన్నికల సమయంలో అప్పటికప్పుడు తీసుకొనే నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలు ఇవ్వొచ్చు కానీ ఎన్నికలకు మూడు నెలల ముందు తీసుకొనే ఇటువంటి నిర్ణయాలు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయని ఎన్నికల తర్వాత తప్పక తెలుస్తుంది.




