కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకలకు వెసులుబాటు ఇవ్వడంతో రాష్ట్రాలు అమ్మకలకు సిద్ధం అవుతున్నాయి. పెట్రోలియం అమ్మకాలతో పాటు మద్యం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రాలకు కీలకం. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం మద్యపాన నిషేధం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నా ఎప్పుడెప్పుడు మద్యం అమ్మకాలు మొదలు పెడదామా అని ఆసక్తితో ఉంది.
ఇక కొత్త మార్గదర్శకాలు అమలుకు ఒక్క రోజు ముందే… ఏపీలో మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రభుత్వ అనుమతితో ఆదివారం 20 డిస్టలరీలు తెరుచుకోనున్నాయి. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతిచ్చింది. కొన్ని నిబంధనలతో మద్యం తయారి మొదలు పెట్టమని ఆదేశాలు ఇచ్చింది.
మద్యం తయారీ కంపెనీలను పూర్తిగా శానిజైట్ చేయాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. మద్యం తయారీ సమయాల్లో కార్మికులు సామాజిక దూరం పాటించాలని, మద్యం తయారీ కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు వేర్వేరుగా ఉండాలని ప్రభుత్వం సూచనలు చేసింది. మద్యం తయారీ కంపెనీల్లో గుట్కా, సిగరేట్ నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కంపెనీల్లో కార్మికులు లిఫ్టులు ఉపయోగించవద్దని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. మరో వైపు సోమవారం నుండి గ్రీన్, ఆరంజ్, రెడ్ జోన్లలో మద్యం షాపులు తెరవడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. కేవలం కేసులకు సంబంధించిన గృహాలు ఉండే కంటైన్మెంట్ జోన్లలో మద్యం షాపులు ఉంటే మాత్రం అవి తెరుచుకోవు. వచ్చే నెలా రెండు నెలలో రైతు భరోసా, అమ్మ ఓడి వంటి కీలక పథకాలకు నిధులు విడుదల చెయ్యాల్సి ఉండడంతో ప్రభుత్వం అమ్మకాలు జోరుగా జరిగేలా చూడాలని డిపార్టుమెంట్ వారికి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.





