కుట్రలు, మూడు పెళ్ళిళ్ళ గురించి అయితే అనర్గళమే కానీ…

YS Jagan

ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి రాష్ట్రానికి సంబందించిన ప్రతీ విషయంపై పూర్తి అవగాహన ఉండాలని ఆశించడం అత్యాశ కాబోదు. పైగా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పాలించిన అనుభవం కూడా ఉన్నప్పుడు మరింత లోతైన అవగాహన కలిగి ఉండాలి.

కానీ ఓ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్త అడిగిన ఓ చిన్న ప్రశ్న కూడా అర్దం కాకపోవడం, వేదికపై ఉన్న మరొకరు ఆ ప్రశ్నని ముఖ్యమంత్రికి వివరించినా సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ADVERTISEMENT

విశాఖ నుంచి పోటీ వైసీపి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బొత్స సత్యనారాయణ ఝాన్సీరాణిని వైసీపి సోషల్ మీడియా కార్యకర్తలకు, పార్టీ కార్యకర్తలకు పరిచయం చేసే కార్యక్రమంలో ఇది జరిగింది.

ఆ యువతి ఏదో క్లిష్టమైన ప్రశ్న అడగలేదు. “సిఎంగారు మీరు రాజకీయాలలోకి రాకముందు నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్నారు. మీరు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. మావంటి ఔత్సాహికులకు మీరు ఓ మంచి సలహా ఏమైనా చెపుతారా సార్?” అని ప్రశ్నించింది.

ఆమె మాట్లాడిన మాటల్లో అర్దం కాకపోవడానికి ఏమీ లేదని తెలుస్తూనే ఉంది. పైగా ఆమె మాటల్లో సగం ఇంగ్లీషు పదాలే ఉన్నాయి. కనుక ముఖ్యమంత్రికి ఇంకా బాగా అర్దమవుతుంది. కానీ ముఖ్యమంత్రికి అర్దం కాకపోవడంతో వేదికపై పక్కనే ఉన్న వ్యక్తి ఆయనకు ఆమె ప్రశ్న గురించి వివరించారు. అయినా అర్ధం కానట్లు మొహం పెడితే అప్పుడు ఆ వ్యక్తే చొరవ తీసుకొని ముఖ్యమంత్రిగారి తరపున ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

ఇది కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవాలా లేక మరేదైనా అనుకోవాలో ఎవరికి వారు ఊహించుకోవలసిందే.

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ రాష్ట్రానికి, పరిపాలనకు సంబందించిన ఏ అంశంపై ప్రశ్నించినా ఏ మాత్రం తడుముకోకుండా పూర్తి సాధికారతతో సమాధానాలు చెపుతుంటారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు వాటికి సంబందించిన ఆర్ధిక, సాంకేతిక వివరాలన్నీ చెపుతారు.

ఏ జిల్లాలో ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో, విద్యుత్ ఉత్పత్తి, వినియోగం ఎంత వంటి క్లిష్టమైన ప్రశ్నలు అడిగినా టక్కున సమాధానం చెపుతారు. ఆయనకున్న ఈ విషయ పరిజ్ఞానం వలననే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ మంత్రులు ఎవరూ ఆయనకు సమాధానాలు చెప్పలేక తడబడుతుంటారు.

కానీ ఏపీలో పై నుంచి కింద వరకు ఇలా ఎందుకుంది? అని సామాన్య ప్రజలకు సందేహం కలగడం సహజం. ముఖ్యమంత్రి, మంత్రులు నిత్యం ఏమి మాట్లాడుతారో అందరికీ తెలుసు. కానీ ప్రజలు వినాలనుకున్న అభివృద్ధి గురించి అరుదుగా మాట్లాడుతుంటారు. పాలకులకు రాష్ట్రానికి సంబందించిన విషయాలపై అవగాహన లేకపోవడం ఏ రాష్ట్రానికైనా శాపమే కదా?

ADVERTISEMENT
Latest Stories