అసెంబ్లీ ౩వ రోజు : జగన్ కు రోజా దొరికింది!

YS jagan supports rojaఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో తొలి రెండు రోజులను ‘కాల్ మనీ’ అంశంతో ప్రతిపక్ష నేత జగన్ కుదిపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై వివరణలు అధికార పక్షానికి అనుకూలంగా మారి… పూర్తి స్పష్టత రావడంతో, ప్రతిపక్ష నేత జగన్ మూడవ రోజు మరో ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సి వచ్చింది. ఈ తరుణంలో వైసీపీ నేత రోజాను శాసనసభ ఒక ఏడాది పాటు సస్పెన్షన్ చేసిన అంశం దొరికినట్లయింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలాన్ని వినియోగించినందుకు గానూ నగరి ఎమ్మెల్యే రోజాను ఒక ఏడాది పాటు అసెంబ్లీ సమావేశాల నుండి బహిష్కరిస్తూ శాసనసభ రెండవ రోజు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

రోజాపై విధించిన సస్పెన్షన్ ను వెంటనే రద్దు చేయాలని, శాసనసభ రూల్ బుక్ లో ఇలాంటి నిబంధన లేదని, అధికార ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రోజాను తిరిగి సమావేశాల్లో హాజరయ్యేలా చూడాలని, లేని పక్షంలో సభను జరగనిచ్చేది లేదని, రోజాతో పాటు వైసీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేయండని జగన్ ఆవేశం వ్యక్తం చేసారు. దీనికి బదులిచ్చిన ఆర్ధిక మంత్రి యనమల, “అసెంబ్లీలో రోజా అసభ్య పదజాలాన్ని వినియోగించినందుకే సస్పెన్షన్ విధించామని, శాసనసభ తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని, చివరకు కోర్టులు కూడా జోక్యం చేసుకోవని, రోజాపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం లేదని” యనమల స్పష్టం చేసారు.

అసెంబ్లీ లోపల పరిస్థితి ఇలా ఉంటే, బయట రోజా హల్చల్ చేసింది. తన వాహనంలో అసెంబ్లీలోకి వచ్చేందుకు ప్రయత్నించగా, మార్షల్స్ అడ్డుకుని, లోనికి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. అయితే తానూ వైసీపీ సీఎల్పీలోకి వెళ్తున్నానని చెప్పిన రోజా మార్షల్స్ ను ప్రతిఘటించడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఎంతసేపటికి వినకపోవడంతో నాంపల్లి పోలీసులు రోజాను అరెస్ట్ చేసి పోలీసు వాహనంలో తీసుకెళ్ళారు. ఈ సమయంలో తన సొంత వాహనంలోనే వస్తానని రోజా వాగ్వివాదం చేయడంతో జారిపడింది. ఆ తర్వాత పోలీసులు తమ విధులను నిర్వహిస్తూ రోజాను అదుపులోకి తీసుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories