గజినీ సినిమాలో హీరో అమీర్ ఖాన్ 15 నిమిషాల క్రితం జరిగిన విషయాలని మరిచిపోయే అరుదైన మతిమరుపు వ్యాధితో బాధపడుతుంటాడు. అందుకని ప్రతీ విషయాన్ని చీటీల మీద రాసుకొని ఆ సమస్యని అదిగమించే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డికి అటువంటి వ్యాధి లేదు. అయినా గతంలో చెప్పిన మాటలు మరిచిపోతుంటారు.
అమరావతి నిర్మించాలంటే లక్ష కోట్లు తీసుకురావాల్సి ఉంటుందని, అదే విశాఖలో అన్నీ సిద్దంగా ఉన్నాయి కనుక ఓ 5-10 వేల కోట్లతో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుకుంటే విశాఖ రాజధాని సిద్దమైపోతుందని చెప్పారు.
అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేయడం తెలివి తక్కువని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ‘విశాఖ విజన్’ సదస్సులో మాట్లాడుతూ రాబోయే పదేళ్ళలో విశాఖ నగరాన్ని 1.05 లక్షల కోట్లతో అత్యద్భుతంగా తీర్చి దిద్దుతానని చెప్పారు.అంటే ఇదివరకు అమరావతి, విశాఖ రాజధాని గురించి తాను చెప్పిన మాటలు జగన్ మరిచిపోయారా? అనే సందేహం కలుగుతుంది.
చేతిలో డబ్బు ఉంటే ఎవరైనా కొత్త ఇల్లు కట్టుక్కోవాలని అనుకుంటారే తప్ప పాత ఇంటిని కొని మరమత్తులు చేసి వాడుకోవాలనుకోరు కదా? ఉద్యోగులకు నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్న, సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టుకున్న జగన్ ప్రభుత్వానికి రూ.1.05 లక్షల కోట్లు ఖర్చు పెట్టగల స్తోమతే ఉంటే అమరావతినే అత్యాధునిక సౌకర్యాలతో హంగులతో నిర్మించుకోవచ్చు కదా?
కానీ 5 ఏళ్ళు కాలక్షేపం చేసేసి ఇప్పుడు విశాఖలో అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయనే విషయం తానే కొత్తగా కనిపెట్టిన్నట్లు జగన్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. నిజానికి జగన్ ప్రభుత్వం నాలుగేళ్ళ క్రితం విశాఖని రాజధాని చేయాలని నిశ్చయించుకున్నపుడే దానికి సరిపడా హంగులు, సౌకర్యాలు కల్పిస్తే ఎవరు వద్దంటారు?
కానీ 5 ఏళ్లలో కొత్తగా ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టకుండా వచ్చే పదేళ్ళలో రూ.1.05 లక్షల కోట్లతో విశాఖని అభివృద్ధి చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? జగన్ ఇదేమాట 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినా నమ్మశఖ్యంగా ఉండేది. లేదా మళ్ళీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే చెప్పుకున్నా నమ్మశఖ్యంగా ఉంటుంది. కానీ మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో తెలీని పరిస్థితిలో ఉన్నప్పుడు, వచ్చే పదేళ్ళ విశాఖని ఎలా అభివృద్ధి చేస్తామో చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?




