అన్నీ ఉన్నా నేను ఎంత నిసహాయురాలినో!

ys-sunitha

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఇద్దరూ నేడు ఒకేసారి తమ జగనన్న మీద తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇప్పటి వరకు ‘వివేకా హంతకుడు’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నా వారిద్దరూ ఇవాళ్ళ తొలిసారిగా బహిరంగంగా వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి ఈ హత్య చేయించాడని, ఆ హంతకుడిని జగన్మోహన్‌ రెడ్డి వెనకేసుకు వస్తున్నారని ఆరోపించారు.

ఓ హంతకుడుని ఎందుకు వెనకేసుకువస్తున్నారు?అని మేము అడుగుతుంటే సమాధానం ఎందుకు చెప్పడం లేదు? మళ్ళీ అవినాష్ రెడ్డికే టికెట్‌ ఎందుకు ఇచ్చారు?అని ఇద్దరు చెల్లెమ్మలు సూటిగా జగన్మోహన్‌ రెడ్డిని ప్రశ్నించారు.

ADVERTISEMENT

ఆనాడు మా తండ్రి వివేకాను హత్య చేయించినవారు నన్ను కూడా చంపకుండా ఉంటారా? నాకు ప్రాణహాని ఉందంటూ సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నాకు చదువు, తెలివితేటలు, డబ్బు అన్నీ ఉన్నా కూడా నా తండ్రి హత్య కేసులో నేను ఎంత నిసహాయురాలినో ఇప్పటికీ అర్ధమైందన్నారు.

కనుక హంతకులు చట్టసభలలో, వారిని వెనకేసుకు వస్తున్నవారు అధికారంలో ఉంటే ఎన్నటికీ న్యాయం జరగదని, ఏ వ్యవస్థలను వారు పనిచేయనీయరని సునీతా రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె వివేకా హత్యకు ముందు వైసీపిలో, తమ వైఎస్సార్ కుటుంబంలో జరిగిన అనేక పరిణామాలను వివరించారు. హత్యలు చేసినవారిని, చేయించినవారినే అమాయకంగా నమ్మి మోసపోయానని సునీతా రెడ్డి అన్నారు.

కనుకనే తన తండ్రి హత్యకు కారకులైనవారికి, వారిని వెనక నుంచి నడిపించినవారందరికీ ఎప్పటికైనా శిక్షలు పడాలనే కోరికతోనే తాను పట్టుదలగా న్యాయపోరాటాలు చేస్తున్నానని సునీతా రెడ్డి అన్నారు. కనుక నేను న్యాయం కోసమే పోరాడుతున్నాను తప్ప రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదన్నారు. రాజకీయ ప్రయోజనాలే ఆశిస్తే ఎప్పుడో ఎన్నికలలో పోటీ చేసి గెలిచి ఉండేదాన్ని అని వైఎస్ సునీతా రెడ్డి అన్నారు.

వైఎస్ షర్మిల కడపలో ఎన్నికల ప్రచారం చేస్తూ, “వివేకా హత్య కేసులో నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డికి వైసీపి అధినేత జగన్‌ టికెట్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నిచారు. సీబీఐ కూడా అవినాష్ రెడ్డి నిందితుడని పేర్కొందని, అటువంటి వ్యక్తికి టికెట్‌ ఇచ్చి ఎందుకు వెనకేసుకు వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కేసు విషయం పక్కన పెట్టినా ఓ ఎంపీగా అవినాష్ రెడ్డి కడప అభివృద్ధికి ఎన్నడైనా ఒక్క పని చేయించారా? కనీసం కడప స్టీల్ ప్లాంట్‌ నిర్మాణం చేయించగలిగారా?ఓ ఎంపీగా కూడా ప్రజలకు సేవ చేయలేకపోయిన అవినాష్ రెడ్డికి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసిన జగన్మోహన్‌ రెడ్డి ఇద్దరికీ మళ్ళీ ఎందుకు ఓట్లు వేయాలని వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు.

ఇద్దరు చెల్లెమ్మలు వైఎస్ కుటుంబానికి చెందినవారే. వారే ఈవిదంగా నిలదీసి ప్రశ్నిస్తున్నప్పుడు, తమ అన్న జగన్మోహన్‌ రెడ్డిని ఆయన పార్టీని ఓడించాలని కోరుతున్నప్పుడు ప్రజలు ఆలోచించకుండా ఉంటారా?

ADVERTISEMENT
Latest Stories