వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతుండగా సోషల్ మీడియాలో వైసీపీ తన వాదనలు బలంగా వినిపిస్తుండటం విశేషం. ఈ హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబందమూ లేదని వైసీపీ భావిస్తున్నట్లయితే, ఈ కేసులో సునీతా రెడ్డి ఏవిదంగా ఇంప్లీడ్ అయ్యి తనవాదనలు వినిపిస్తున్నారో అదేవిదంగా వైసీపీ కూడా ఇంప్లీడ్ అయ్యి ఆయన నిర్ధోషి అని వాదించి నిరూపించవచ్చు. కానీ సోషల్ మీడియాలో తన వాదనలు వినిపిస్తోంది!
“వివేకా హత్యకేసులో కీలకాంశాలపై సీబీఐ మౌనమేల? అంటూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ కేసులో ముఖ్యమైన ఇతర అంశాలను సీబీఐ పట్టించుకోకుండా వ్యక్తులను టార్గెట్ చేసుకొని దర్యాప్తు జరపడం వెనుక కారణాలు?ఏమిటని వైసీపీ ప్రశ్నించింది. ఒకవేళ ఆ కారణాలు తెలుసుకోవాలనుకొంతే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కనుక సిట్ ఏర్పాటు చేసి సీబీఐ మీద దర్యాప్తు చేయిస్తే మంచిదేమో?
ఈ కేసులో చంద్రబాబు నాయుడు, సునీతారెడ్డి కుమ్మక్కయి సీబీఐపై ఒత్తిడి చేసి అవినాష్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ సీబీఐ ఈకేసు విచారణ జరుపుతున్నప్పుడు, సోషల్ మీడియాలో ఈవిదంగా పోస్టులు పెడుతూ వైసీపీయే సీబీఐపై ఒత్తిడి పెంచి దాని దర్యాప్తుని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోంది కదా?
ఇంతకీ వైసీపీ సోషల్ మీడియాలో ఈ హత్య కేసు గురించి ఎందుకు పోస్టులు పెడుతోంది?వాటితో అది ఏం సాధించాలనుకొంటోంది?అనే సందేహం కలుగకమానదు. 1. అవినాష్ రెడ్డికి అండగా వైసీపీ, వైసీపీ ప్రభుత్వం రెండూ ఉన్నాయని చాటి చెప్పుకొనేందుకు 2. తద్వారా సీబీఐ మీద, సాక్షుల మీద ఒత్తిడి పెంచడం 3. అవినాష్ రెడ్డికి ఈ హత్య కేసుతో ఎటువంటి సంబందమూ లేదని ప్రజలకు నచ్చజెప్పేందుకు.
ఈ కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సీబీఐ తరపు న్యాయవాదులు హైకోర్టులో తమ వాదనలను వినిపించారు. కనుక దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది తప్ప వైసీపీ లేదా సోషల్ మీడియా కానే కాదు. సోషల్ మీడియాలో ఎంత గట్టిగా వాదించినా అబద్దాలు నిజమైపోవు. నిజాలు మారిపోవు. ఒకవేళ సోషల్ మీడియాలో వాదనలతో ఎవరికి కావలసిన్నట్లు వారు తీర్పులు చెప్పుకొనే వెసులుబాటు ఉంటే ఇంకా కోర్టులు, విచారణలు ఎందుకు?



