తెర వెనుక ఒకటి చెప్పడం… తెర ముందు మరొకటి మాట్లాడడం… జగన్ మార్క్ రాజకీయంగా విశ్లేషకులు అభిప్రాయ పడుతుంటారు. ఈ రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా అదే జరిగిందని తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాల గురించి అధికార, ప్రతిపక్ష సభ్యులతో స్పీకర్ బియస్సీ సమావేశం నిర్వహించి నిర్ణయిస్తారు. ఈ సారి కూడా అదే తరహాలో స్పీకర్ కోడెల శివప్రసాద్ నేతృత్వంలో బియస్సీ సమావేశం నిర్వహించి, మొదటి రోజు అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల గురించి, రెండవ రోజు ‘కాల్ మనీ’ అంశంపై చర్చించాలని నిర్ణయించారు. దీనికి అధికార, ప్రతిపక్ష సభ్యులు కూడా అంగీకరించారు. ఇది తెర వెనుక జరిగిన విషయం.
కట్ చేస్తే, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక, తెర ముందు ఏం జరిగిందో తెలుసుకున్న సామాన్య ప్రజలు అవాక్కవుతున్నారు. బియస్సీ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఈ రోజు అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలపై చర్చ చేపట్టాలి. అయితే, ఉన్నట్లుండి ప్రతిపక్షం ‘ప్లేట్’ ఫిరాయించింది. అంబేద్కర్ జయంతి అంశాన్ని పక్కనపెట్టి, ‘కాల్ మనీ’ స్కాంపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. దీనికి ప్రతిస్పందించిన టిడిపి నేతలు, ‘కాల్ మనీ’ స్కాంపై చర్చ చేపట్టడానికి సిద్ధంగా ఉందని, అయితే ఆ చర్చ రెండవ రోజు చేపట్టడానికి స్వయంగా జగనే అంగీకరించి, ఇపుడు ఇలా రచ్చ చేయడం సరికాదని, అసెంబ్లీ సమావేశాలు జరుగకుండా చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలను వెనక్కి వెళ్లాల్సిందిగా కోరినప్పటికీ, సభ్యులు వినకపోవడంతో, ప్రతిపక్ష సభ్యుల తీరును మార్చుకోవాల్సిందిగా స్పీకర్ సూచించారు.
దీంతో మరోసారి జగన్ అనుసరిస్తున్న రాజకీయం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనను తానూ మోసం చేసుకోవడంతో పాటు ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వినపడుతున్న విమర్శలు. ఇదే అభిప్రాయాన్ని బీయస్సీ సమావేశంలో కూడా పట్టుబట్టినట్లయితే, అసెంబ్లీలో వారు చేస్తున్న ఆందోళనకు కనీసం ఓ అర్ధముంటుందన్న భావనలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాల్ మనీ స్కాంలో అత్యధికంగా 44 మంది వైసీపీ అనుచరులు ఉన్నారన్న ప్రస్తుత సమాచారం, మరు నాటికి రెట్టింపు అవుతుందేమోనన్న భావనతో, బహుశా ఈ రోజే చర్చకు పట్టుబడుతున్నారేమోనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.





