ఏపీలో వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి నడుస్తోందని అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఇదిగాక మూడు సీరియస్ కేసులు వైసీపీ తలపై కత్తుల్లా వేలాడుతూనే ఉన్నాయి. కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి నెలనెలా టంచనుగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ , ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్లతో భేటీ అవుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. వారిపట్ల విధేయంగా ఉంటునందుకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరిస్తోందని వేరే చెప్పక్కరలేదు.
కానీ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు, శుక్రవారం బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఆయన వ్యక్తిగత సహాయకుడు బిజెపి కార్యకర్త కశయ్య యాదవ్, బిజెపి దళిత నాయకుడు పణతల సురేష్ మందడంలో అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులను కలిసి తిరిగి వస్తుండగా వైసీపీ కార్యకర్తలు వారి వాహనాలను అడ్డుకొని రాళ్ళు రువ్వి, కశయ్య యాదవ్, పణతల సురేష్లను పట్టుకొని చితకబాదారు.
బిజెపి కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలను అడ్డుకొని ఉండకపోయుంటే వారి చేతిలో సత్యకుమార్ కూడా దెబ్బలు తిని ఉండేవారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి రైతులను కలిసిన తర్వాత అత్యవసరంగా హాస్పిటల్కు వెళ్ళిపోయారు లేకుంటే ఆయన కూడా ఈ చేదు అనుభవం ఎదుర్కోవలసి వచ్చేది.
పోలీసుల ఎదుటే బిజెపి జాతీయ కార్యదర్శి వాహనంపై వైసీపీ కార్యకర్తలు రాళ్ళు రువ్వి విధ్వంసం సృష్టించి, బిజెపి కార్యకర్తలను చితకబాదడంతో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. వైసీపీ దాడులను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఖండించారు.
అయితే బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి రైతుల శిబిరం వద్ద మాట్లాడుతూ సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంతో వారిపై దాడి చేశారని, కానీ పోలీసులు వెంటనే స్పందించడంతో పెద్ద ఘర్షణను నివారించగలిగామని గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ పి.అనిల్ విలేఖరులతో అన్నారు. ఆ వాహనంలో బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఉన్నారనే విషయం తమకి తెలియదని, కానీ బిజెపి నేతలు రైతులకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్నారని తెలిసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా అక్కడి నుంచి పంపించామని చెప్పారు.
కేంద్రం సహాయసహకారాలతో, దాని దయాదాక్షిణ్యాలతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, బిజెపి నేతలపై ఈవిదంగా దాడులు చేయడం వైసీపీ రాజకీయ ఆత్మహత్య చేసుకొన్నట్లే అవుతుంది. బిజెపి జాతీయ కార్యదర్శిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినా కేంద్రప్రభుత్వం చూసీచూడన్నట్లు ఊరుకొంటుందనుకోలేము. దీని పర్యవసానాలు ఏవిదంగా ఉండబోతాయో త్వరలోనే కనిపిస్తాయి. రాష్ట్ర బిజెపి నేతలు కూడా ఇకపై వైసీపీతో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్దమైతే ఇక చెప్పక్కరలేదు.



