వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవరుగా మారిన డ్రైవర్ దస్తగిరి తండ్రి షేక్ హాజీ వలీపై శుక్రవారం వైసీపికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పులివెందులలో ఆటో నడుపుకుంటూ కుటుంభాన్ని పోషించుకొనే షేక్ హాజీ వలీ నిన్న శివరాత్రి సందర్భంగా పట్టణంలోని నామాలగుండు వద్దకు వెళ్ళినప్పుడు, అక్కడ వైసీపి కార్యకర్తలు ఆయన ఆటోని అడ్డుకొని బయటకు లాగి విచక్షణా రహితంగా దాడి చేశారు.
ఆ దాడిలో షేక్ హాజీ వలీపై తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా వారు ప్రాధమిక వైద్యం చేసి పంపించేశారు. వెంటనే ఆయన కుమారుడు దస్తగిరి పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించిన్నట్లు తెలుస్తోంది.
దస్తగిరి తనను కడప జైల్లో ఉన్నప్పుడే లేపేస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల బెయిల్పై బయటకు వచ్చినప్పుడు కూడా తన ప్రాణానికి చాలా ప్రమాదం ఉందని అయినా తాను భయపడబోనని చెప్పారు. వివేకా హత్య కుట్ర వెనుక వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల ప్రమేయం ఉందని దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు.
అందుకే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని వెనకేసుకొని వస్తున్నారని, అందుకే ఈ కేసు గురించి వారిద్దరూ మౌనంగా ఉండిపోతున్నారని దస్తగిరి ఆరోపించారు. ఈసారి ఎన్నికలలో తాను జగన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని దస్తగిరి అన్నారు.
ఈ కేసులో దస్తగిరి అప్రూవరుగా మారడమే వైసీపిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఇష్టం లేదు. అటువంటప్పుడు, దస్తగిరి మీడియా ముందుకు వచ్చి నేరుగా ఎంపీ, ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తే సహించగలరా? లేరు.
కనుకనే దస్తగిరి తండ్రి షేక్ హాజీ వలీపై దాడి చేశారని భావించవచ్చు. అయితే ఇది తమను కాదని ఎదిరిస్తే ఏమవుతుందో దస్తగిరికి తెలిపేందుకు చూపిన చిన్న శాంపిల్ మాత్రమే అని భావించవచ్చు.
కనుక దస్తగిరి చెప్పుకున్నట్లు, ఆయన ప్రాణాలు, కుటుంబ సభ్యులా ప్రాణాలు కూడా చాలా రిస్కులో ఉన్నట్లే. కనుక అప్రమత్తంగా ఉండకపోతే ఎన్నికలలోగా వారి ఫోటోలకు కూడా దండలు పడిపోవచ్చు. అయినా వివేకాకే దండ పడినప్పుడు దస్తగిరి ఓ లెక్కా?ఇప్పుడు శాంపిల్ కూడా చూపించారు కనుక దస్తగిరి, ఆయన కుటుంబ సభ్యులు మరింత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.




