ఆంధ్రప్రదేశ్ పేరుతో నిత్యం తెలంగాణలో ప్రాంతీయవాద రాజకీయాలు చేసే బిఆర్ఎస్ తెలంగాణ విభజనను బహిరంగంగా బలంగా వ్యతిరేకించిన వైసీపీ తో స్నేహసంబంధాలు కొనసాగిస్తుంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయ మిత్ర బంధాలు ఇన్నాళ్లు తెరవెనుక సాగేవి. కానీ ఇప్పుడు అవి ఫ్లెక్సీ ల రూపంలో బయటకొస్తున్నాయి.
తాజాగా వైసీపీ చేపట్టిన డీఎస్సి నిరసన ర్యాలీలో జగన్ ఫ్లెక్సీ లో కేటీఆర్ ఫోటో కనిపించడం ఇప్పుడు ఈ రెండు పార్టీల అంతర్గత స్నేహాన్ని మరోసారి బహిర్గతం చేసినట్టయ్యింది. “రాసి పెట్టుకోండి 2029 లో అధికారంలోకి వచ్చేది మేమే” అనే నినాదంతో ఈ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు వైసీపీ శ్రేణులు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ – ఏపీ సీఎం బాబు మధ్య ఉన్న స్నేహం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేస్తుందని, ఏపీలో ఉన్న బాబుకి గురు దక్షిణగా తెలంగాణ నీటి హక్కులను రేవంత్ ఏపీకి కట్టబెడుతున్నారంటూ నిత్యం ఏపీ వైపు వేలెత్తి చూపే కేటీఆర్ ఇప్పుడు అసలు రాష్ట్ర విభజనే వద్దు అంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న జగన్ తో ఎలా జత కడతారు.?
అంటే బిఆర్ఎస్ చేసే ప్రాంతీయవాద రాజకీయాలు కేవలం వారి పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమేనా.? వైసీపీ ఒంటరి రాజకీయం వెనుక ఉన్న ఒక అదృశ్య శక్తి ఇప్పుడు ఫ్లెక్సీల రూపంలో ఒకటి బయటకొచ్చింది. ఇంకా ఆ తెరవెనుక ఉన్న అదృశ్య శక్తుల సంఖ్య చాలానే ఉందని, ఆ శక్తులే వైసీపీ ని ఇంకా కేసుల నుంచి కాపు కాస్తున్నాయని ఏపీ రాజకీయాలలో విస్తృత చర్చ నడుస్తుంది.
వాటిని కూడా ఎదోకరోజు వైసీపీ శ్రేణులనే ఫ్లెక్సీల రూపంలో బయటపెడతారేమో చూడాలి మరి..! ఏదిఏమైనా ఏపీలో వైసీపీ తెలంగాణలో బిఆర్ఎస్ ఒక్కట్టే అనేది అటు ఏపీ వారికీ ఇటు తెలంగాణ వారికీ పూర్తి స్పష్టత వచ్చినట్టే. మరి 2029 కోసం కూటమి ఇటు వైసీపీ తో పాటుగా అటు బిఆర్ఎస్ తో కూడా రాజకీయ యుద్ధం చేయాల్సిందేనా.?




