మీ బిడ్డకు స్టార్ క్యాంపైనర్లు లేరు…మీ బిడ్డకు మీడియా ఛానెల్స్ లేవు…మీ బిడ్డకు ఒక దత్తపుత్రుడు లేడు…మీ బిడ్డకు ప్రచార ఆర్భాటాలు తెలియదు అంటూ ఉన్నది లేనట్టు..లేనిది ఉన్నట్టు ప్రజలను మభ్య పెట్టగల జగన్ మోహన్ రెడ్డి ఆయన అనుచర గణం లీలలు ఒక్కక్కొకటిగా బయటకు వస్తున్నాయి.
ఎన్నికల కమిషన్ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఇటువంటి సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈసీ ఆదేశాలకు అనుకుణంగా తమ కార్యాచరణ రూపొందించుకోవాల్సి వస్తుంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో అధికార పార్టీ ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ పని చేయకూడదు అంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసినా వైసీపీ నాయకులు పట్టించుకునే పరిస్థితులలో లేరనేది నిన్న మొన్న జరిగిన వాలంటీర్ల ఘటనలతో రుజువయ్యింది.
వైసీపీ తరుపున ఇంటిఇంటికి తిరుగుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్న కొంతమంది వాలంటీర్లను ఈసీ విధుల నుంచి తప్పించింది. ఒకదారి మూస్తే మరో దారిలో వస్తా అంటూ ఇప్పుడు ఓటర్లను ప్రలోభపెట్టడానికి మరో మార్గాన్ని ఎంచుకున్నారు వైసీపీ నాయకులు. సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు జగన్ బొమ్మలతో కూడిన అట్టపెట్టలతో చీరలను పంపణీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
సత్తెనపల్లి పారిశ్రామిక వాడలోని గోడౌన్లలో గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ నిర్వహించిన తనిఖీలలో జగన్ బొమ్మతో కూడిన 5000 చీరలను అధికారులు సీజ్ చేసారు. పంచడానికి మీరు ‘సిద్ధమైతే’…సీజ్ చేయడానికి ‘మేమంతా సిద్ధం’ అంటున్నారు అధికారులు. సత్తునపల్లి మహిళా ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఇలా చీరల వెనుక కథ నడిపిస్తున్నారు సోషల్ మీడియాలో రాజకీయ ప్రవచనాలు చెప్పే అంబటి రాంబాబు అంటూ అంబటి పై సెటైర్లు పేలుతున్నాయి.
వై నాట్ 175 అంటూ మైకుల ముందు మేకపోతు గాంభీర్యాలు పలుకుతూ ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఈ ప్రయాసలు దేనికో..? మా ప్రభుత్వం వలన మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటేనే మా పార్టీకి ఓటేయండి….మా ప్రభుత్వంలో 90 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు…తిరిగి అధికారంలోకి వచ్చేది మేమే…ఇది పేదలకు – పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం…ఈ యుద్ధంలో అంతిమ విజయం మాదే అంటూ ప్రగల్బాలు పలికిన వైసీపీ నేతలు ఇప్పుడు చీరలు పంచుతూ…కుక్కర్లు పంచుతూ…వంట సామాన్లు ఇస్తూ చేసేదేమిటి..? ఇది ఓటమి భయమా..? గెలుపు మీద నమ్మకం లేకపోవడమా..?
ఇన్నాళ్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు తినే చిక్కి పాకెట్స్ మీద, పసి పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఇచ్చే పాల ప్యాకెట్ల మీద, పిల్లలు చదువుకునే పుస్తకాల నుంచి బాగ్ లు, వ్యక్తిగత ఆస్తి పత్రాల వరకు జగన్ బొమ్మలతో నింపేసిన వైసీపీ ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరిందనే చెప్పాలి. ప్రభుత్వ భవనాలకు, మున్సిపాలిటీ లో చెత్త తీసే వాహనాలు, కరెంట్ స్తంభాలను, చెట్లకు ఇలా ఏ ఒక్కదాన్ని వదలకుండా రాష్ట్రమంతా వైసీపీ పార్టీ జెండా రంగులతో నింపేశారు.
అయినా వీరి ప్రచార దాహం తీరలేదు అన్నట్లుగా ఇప్పుడు మహిళా ఓటర్లకు పంచె చీరల అట్టపెట్టి మీద కూడా జగన్ బొమ్మలు ముద్రించారు. ఇక ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ బొమ్మలతో కూడిన డబ్బు నోట్లను తీసుకువస్తారేమో మరి..! ఇచ్చట జగన్ బొమ్మలతో కూడిన చీరలు ఇవ్వబడును అంటూ సత్తునపల్లి ప్రజానీకాన్ని ప్రలోభపెట్టాలని చూసిన ఆ వైసీపీ నాయకుడు ఎవరనేది అధికారికంగా బయటకు రాకపోయినప్పటికీ ఆ నేత ఎవరో మాకు తెలుసులే అంటూ గంటకో కామెంట్ చేస్తూ ఈ వీడియో ను వైరల్ చేస్తున్నారు.
చీరల పంపిణీతో మొదలైన వైసీపీ ప్రలోభ కార్యక్రమాలు ఎన్నికలు పూర్తయ్యే నాటికీ ఇంకెన్ని చిత్రాలు చూడాలో…ఇంకెన్ని చిత్రాలు చూపిస్తారో..! వైసీపీ కి ఈ జగన్ బొమ్మల ఫోబియో ఇంకెంతకాలమో..?




