2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వివేకా హత్య పై వైసీపీ చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు అనేది కాలం గడిచే కొద్ది వివేకా కుటుంబసభ్యులతో పాటు రాష్ట్ర ప్రజానీకానికి కూడా అవగతం అవుతూ వచ్చింది. వివేకా గుండె పోటుతో మొదలుపెట్టిన జగన్ రాజకీయ ఆట…సాక్షి ఎన్నికల వేట…నారసురా రక్త చరిత్రతో ముగించారు.
వైసీపీ చేస్తున్న ఆరోపణలను.., సాక్షి రాస్తున్న అసత్య ప్రచారాలను సమర్దవంతంగా తిప్పికొట్టలేకపోయిన ఆనాటి అధికార పక్షమైన టీడీపీ…దాని ఖర్మ ఫలితం అనుభవిస్తూ వచ్చింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చి రాగానే తన చిన్నాన్న వివేకా దారుణ హత్యకు కారకులను చట్టం ముందు దోషిగా నిలబడతారు అని ఆశగా చూసిన వివేకా కుటుంబసభ్యులకు, వైస్సార్ అభిమానులకు, వైసీపీ కార్యకర్తలకు తత్త్వం బోధ పడడానికి ఎంతో సమయం పట్టలేదు.
అసలు వివేకా హత్య కేసులో సూత్రదారులు ఎవరో…దాని వెనుక ఉన్న పాత్రధారులు ఎవరో ప్రపంచం మొత్తానికి తెలిసినా ఇంకా కేసు ముందుకు సాగకపోవడం వెనుక ఉన్న ఆ బలమైన శక్తి ఎవరనేది జగన్ సోదరీమణులు బాహాటంగా ఉటంకిస్తున్నా ఇంకా ఏవేవో కాకమ్మ కథలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ అనుచరగణం.
ఇలా వివేకా హత్యను అడ్డుపెట్టుకుని నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు రాసుకుని ఏపీలో ఒక్కఛాన్సు అవకాశం సంపాదించుకున్నారు జగన్. ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. దీనితో ఈసారి టీడీపీ పైన బాబు పైన ఎదో ఒక బలమైన ఆరోపణ చేసి వారి పై నిందలు వేసి మరో ఛాన్స్ అడగడానికి సంసిద్ధంగా ఉన్న వైసీపీ కి విశాఖలో పట్టుబడ్డ 25 వేల కేజీల డ్రగ్స్ సంఘటనను అవకాశంగా మరల్చుకోవాలని ఆశ పడ్డారు.
అయితే ఈసారి టీడీపీ నేతలు వైసీపీ కి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. రెండు సంవత్సరాల ముందే లోకేష్ ఈ బ్రెజిల్ డ్రగ్స్ దందాతో వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ కు అడ్డాగా మార్చబోతుంది అంటూ చేసిన వ్యాక్యలను టీడీపీ తన అఫీషియల్ పేజీలో పోస్ట్ చేసింది. అలాగే టీడీపీ నేతలు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ పాత్ర పై కథనాలు ప్రచురించడంతో….ఇక చేసేదేమి లేక ఎదురుదాడి మొదలుపెట్టింది వైసీపీ. ఈ డ్రగ్స్ దందాలో పురందరేశ్వరి, చంద్రబాబు, లోకేష్ పాత్రలు ఉన్నాయంటూ మరో కొత్తరాగాన్ని ప్రజలలోకి ఎక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అయితే ఎంత అమాయకులనైనా తమ మాటలతో, చెప్పే కల్లబొల్లి కబుర్లతో ఎదో ఒక సారి లేదా మరో సారి మోసం చేయగలుగుతారు కానీ ప్రతిసారి ఆ ప్రయత్నాలు సఫలం కావనేది ఈనాటికి వైసీపీ నేతలకు తెలిసి వచ్చినట్టు ఉంది. మొదటి సారిగా తన తండ్రి వైస్సార్ చావు వెనుక రిలయెన్స్ వారి హస్తం ఉంది అంటూ ఏపీ ప్రజలను నమ్మించి అధికారం దిశగా ఒక మెట్టు ఏర్పాటు చేసుకున్నారు. జగన్ కు అధికారం రాగానే అదే రిలయన్స్ వారికి రాష్ట్ర రాజ్యసభ టికెట్ ఇచ్చి నమ్మిన ప్రజలను మోసం చేసారు జగన్.
ఆ తరువాత బాబాయ్ వివేకా ఉదాంతం…చంపింది…చంపించింది…టీడీపీ నే అంది. అధికారం రాగానే ఈ హత్యకు పూర్తి బాధ్యత ఆయన కుటుంబానిదే అంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిని కాపు కాస్తూ మరోసారి ఓటేసిన ఓటర్లను మోసం చేసారు. ఈ రెండు మోసాలతో జగన్ ఒక్క ఛాన్స్ అవకాశం పొందగలిగారు. ఇప్పుడు మరో ఛాన్స్ కోసం ఈ డ్రగ్స్ కేసుని కూడా టీడీపీ ఖాతాలో వేయడానికి వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అలాగే టీడీపీ తో పాటుగా అయన కుటుంబసభ్యులే అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి పైన కూడా ఆరోపణలు షురూ చేసింది వైసీపీ.
ఇలా ఎప్పుడు తమ పాత్ర ఉన్న అంశాలను మరో పార్టీ నెత్తిన రుద్ది ప్రజలను మభ్యపెట్టి అధికారం పొందాలనుకోవడమేనా జగన్ పాటిస్తున్న విలువలు. రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ దెబ్బలు తీసి కుటుంబ విలువలు విచ్ఛిన్నం చేసే హత్య రాజకీయాలేనా వైసీపీ విశ్వసనీయత..? నొక్కిన బటన్లు చెప్పుకుంటున్న జగన్..దాని కోసం చేసిన అప్పులను చెప్పగలరా..? చేసేదొకటి..చెప్పేదొకటి అంటే ప్రతిసారి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉండరనేది వైసీపీ ఇప్పటికైనా గ్రహించాలి.




