ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తాజాగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు దేశంలో అనేక రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ బాధితుల న్యాయం కోసం అంటూ మొదలైన ఈ ఉద్యమం చివరికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో రాజకీయ రూపం లోకి మారింది.
అయితే సీజేపీ ఉద్యమం అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం వెనుక జీన్ జీ ల మద్దతు బలంగా ఉంది. జీన్ జీ లు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వస్తే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అనేదానికి నీట్ ఉద్యమం అంకురార్పణ చేయడంతో ఇప్పుడు వైసీపీ కి సీజేపీ ని ఆదర్శంగా తీసుకుని కూటమి ప్రభుత్వం పై పోరాడేందుకు సిద్దమయ్యింది.
అందుకు గాను వైసీపీ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రకటించిన మెగా డిఎస్సి ని తెరమీదకు తెచ్చి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా డిమాండ్ తో నిరసనలకు పిలుపునిచ్చారు. ఇందుకు గాను వైసీపీ నిరసనల షెడ్యూల్ ను మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
జులై 31 న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ, ఆగస్టు 3, 4 తేదీలలో అన్ని నియోజకవర్గాలలో టౌన్ హాల్ సమావేశాలతో పాటుగా
ఆగష్టు 6 – 9…రిలే నిరాహార దీక్షలు,
డిమాండ్ 1: డిఎస్సి 2025 పై సిబిఐ విచారణ,
డిమాండ్ 2 : లోకేష్ రాజీనామా,
డిమాండ్ 3: ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు,
డిమాండ్ 4 : నిరుద్యోగ భృతి 3000,
ఇక ఆగస్టు 10 న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు….అంటూ వైసీపీ తన నిరసన షెడ్యూల్ ని ప్రకటించింది. అయితే వైసీపీ చేపట్టిన ఈ నిరశన కార్యక్రమాలకు గాను రాష్ట్రంలోని యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్దఎత్తున పాల్గొనాలంటూ పేర్ని నాని పిలుపునిచ్చారు.
అయితే వైసీపీ పిలుపునిచ్చినట్టుగా ఏపీలో జెన్ జీ ల మద్దతు ఉంటుందా.? కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామా తరహాలో ఏపీలో లోకేష్ రాజీనామాకు అసలు అవకాశం ఉంటుందా.? ఇప్పటికే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ డిఎస్సి వివాదాల పై ఎప్పటికప్పుడు వివరణ ఇస్తున్నా వైసీపీ డిఎస్సి విషయంలో వైసీపీ ఎందుకంత నవరస రాద్ధాంతం చేస్తుంది అన్న చర్చ నడుస్తున్న ఈ తరుణంలో వైసీపీ నిరసనలు అనుకున్న ఫలితాలను అందిస్తాయా.?




