వైసీపిలో నుంచి మెడ పట్టుకొని బయటకు గెంటేయబడ్డ ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరైతే, టికెట్లు ఇస్తున్నా గోడ దూకి పారిపోతున్నవారు మరికొందరు. నిన్న మొన్నటివరకు వారందరూ ఆణిముత్యాలే అని వైసీపి చెప్పుకొనేది. ఇప్పుడు అదంతా వైసీపి ‘వేస్టేజ్’… దానిని ఎత్తుకొని టిడిపి, జనసేనలు సంబరపడిపోతున్నాయని వైసీపి నేతలు చెప్పుకోవడం ‘గాలికిపోయే పేలాలు కృష్ణార్పణం’ వంటిదే కదా?
ఆనాడు టైటానిక్ షిప్పులో ప్రయాణిస్తున్న వారందరికీ మంచుకొండని ఢీకొన్నప్పుడు, షిప్పుకి ఏమీ కాదని ధీమా ఉండేది. కానీ వైసీపి అనే టైటానిక్ షిప్ 175/25 సీట్లతో పయనిస్తుంటే దానిలో నుంచి చాలా మంది సిట్టింగులు దూకేస్తుండటం గమనిస్తే, వారి దూరదృష్టిని మెచ్చుకోక తప్పదు.
తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు (జంగాలపల్లె శ్రీనివాసులు) జనసేనలో చేరిపోబోతున్నారు. జిల్లాలో చక్రం తిప్పుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సలహా మేరకు వైసీపి 3వ జాబితాలోనే జగన్ ఆయన టికెట్ చించేశారు.
బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆయన స్థానంలో రెడ్డి వర్గానికి చెందిన విజయానంద రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. దాంతో షాక్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు వైసీపి గేటు దాటక తప్పలేదు. ఆయన పవన్ కళ్యాణ్తో కలిసి ఫోటో దిగగానే వైసీపి నుంచి సస్పెన్షన్ వేటు వేసింది.
జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. జగన్ ఆయన టికెట్ చించేసి ఈసారి తోట నర్సింహంకు ఖరారు చేశారు. చంటిబాబు హర్ట్ అయినా ఇంకా వైసీపిలోనే ఉన్నారు. తోట నర్సింహంకు మద్దతు తెలిపారు కూడా.
అయినా తనను పార్టీ నుంచి బయటకు పంపించేసేందుకు తోట నర్సింహం పొగ పెడుతున్నారని చంటిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బహుశః చంటిబాబు ఇంకా పార్టీలోనే ఉంటే జగన్ మనసు మారితే మరో జాబితాలో తన పేరు కొట్టేసి ఆయన పేరు వ్రాస్తారేమో? అని తోట నర్సింహం భయాన్ని అర్దం చేసుకోవచ్చు.
మంత్రి పదవి ఆషామాషీగా లభించేది కాదని రోజాని అడిగితే చెపుతారు. అందుకే ఆమె తిరుమల-నగరి-తాడేపల్లి మద్యనే ప్రదక్షిణాలు చేస్తుంటారు. కానీ గుమ్మనూరు జయరాంకి జగన్ మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఈసారి కర్నూలు నుంచి లోక్సభకు పోటీ చేయాలని కోరారు కూడా. కానీ ఆయన పార్టీకి రాజీనామా చేసి నేడు టిడిపిలో చేరిపోతున్నారు.
ఈ సందర్భంగా ఆయన వైసీపి గురించి రెండు ముక్కలు చెప్పారు. “తాడేపల్లి ప్యాలస్లో ఓ ఉత్సవ విగ్రహం… దానికి సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయ్ రెడ్డి అనే ఇద్దరు పూజారులు ఉన్నారు. పెత్తనం అంతా వారిదే. జగన్ నిమిత్తమాత్రుడు,” అని అన్నారు.
ఏది ఏమైనప్పటికీ వైసీపిలో ఇంకా మరికొన్ని జాబితాలు… వాటితో పాటే మరికొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు వెళ్ళడం రెండూ ఖాయమే. పోయేవాళ్ళని పట్టుకొని ఆపలేము కనుక ‘టిడిపి, జనసేన ఆర్పణం’ అని సరిపెట్టుకోవలసిందే.




