నేను హిందువుని… నేను ముస్లింని… నేను ఫలానా కులంవాడిని… నేను మళయాళీని… నేను తెలుగువాడిని అని సగర్వంగా చెప్పుకొంటున్నప్పుడు మండలి చైర్మన్ మోషేన్ రాజు నేను క్రీస్టియన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడటం దేనికి?
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహరంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో క్రీస్టియన్ మతం అవలంభిస్తున్నవారందరూ మేము హిందువులమని లేదా హిందూమతాన్ని, హిందూ దేవుళ్ళని, వారి ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తామని నిరూపించుకునేందుకు పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది. మంత్రి అచ్చెన్నాయుడు నిన్న మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటితోనే ‘నేను క్రీస్టియన్ కాదని’ చెప్పుకునేలా చేశారు.
ఆయన లేదా జగన్ వంద శాతం హిందువులైతే హిందువులమని చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ క్రీస్టియన్ మతాన్ని పాటిస్తూ, క్రైస్తవ ప్రార్ధనలు చేస్తూ ‘నేను క్రీస్టియన్ని కాదు హిందువునే’ అని చెప్పుకోవడం దేనికి? రాజకీయాల కోసం స్వమతాన్ని దాచి పుచ్చుకోవాల్సిన ఖర్మ దేనికి? ఇది అవమానకరం కాదా?
ప్రధాని, ముఖ్యమంత్రి ఏ మతానికి చెందినవారైనప్పటికీ అన్ని మతాలను సమానంగా గౌరవించడం ఓ మంచి సంప్రదాయం.
కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హిందూమతం, దేవాలయాలు, సంస్కృతీ సంప్రదాయాలతో ఓ ఆట ఆడుకున్నారని అందరికీ తెలుసు. కల్తీ నెయ్యి, పరకామణి ఇందుకు రెండు పెద్ద ఉదాహరణలు. ఈ నిజాలు నిగ్గు తేలేవి కావు కనుక అడ్డుగోలు వాదనలతో తప్పించుకోవచ్చు.
కానీ జగన్ తిరుమల శ్రీవారి సెట్టింగ్ని తన ఇంటి ముందు వేయించుకొని ఆ దేవదేవుడిని, ఆయన భక్తులను, హిందువులని అపహాస్యం చేశారు… ఈ నిదర్శనాన్ని వైసీపీలో ఎవరైనా కాదనగలరా?
హిందూమతాన్ని, దేవుళ్ళని అన్య మతస్తులు నమ్మాల్సిన అవసరం లేదు. గౌరవించకపోయినా కనీసం ఉద్దేశ్యపూర్వకంగా అపచారాలు, అపహాస్యం చేయకూడదు కదా?
కానీ అధికార మదంతో చేయకూడనివన్నీ చేసినందుకు అధికారం కోల్పోయినా, ఇంకా తిరునామాలు, పట్టు పంచెలు, హోమాలు చేస్తున్నారు. ఈ వేషాలు, నాటకాలు ప్రజలకు అర్థం కావనుకోవడానికి కారణం నిలువెల్లా నిండిన అహంభావమే!
అయితే జగన్, వైసీపీ నేతల అదృష్టం కొద్దీ హిందువులు కులాలు వారీగా, పార్టీల వారీగా చీలిపోయున్నారు. కనుక వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది.
అయితే ఈ డబుల్ మీనింగ్ డ్రామాలు వేషాలతో తమ మతస్తులలో విశ్వసనీయత కోల్పోతున్నామని గ్రహించినట్లు లేదు. బహుశః వారినీ ‘ఈజీగా మేనేజ్’ చేయవచ్చనే ధీమాతోనే కావచ్చు.




