2019 ఎన్నికలలో ఎవ్వరి ఊహకు అందనంత మెజారిటీ సాధించి తెలుగు రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ ఐదేళ్లుగా రాష్ట్రానికి సాధించిందేమిటి…? పోగొట్టిందేంటి అనేది ఒక్కసారి క్లుప్తంగా తెలుసుకుందాం..!
అసలు వైసీపీ అధికారంలోకి రావడానికి ముఖ్యకారణం చంద్రబాబే అనేది చాలామంది టీడీపీ నేతల ఆరోపణ. అదెలాగో చూద్దాం…ఒక్కసారి తెలంగాణ విషయానికి వెళ్తే తెలంగాణ ప్రజల కొన్ని దశబ్దాల కల నెరవేర్చారు అనే గౌరవంతో తెరాస ప్రభుత్వానికి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ముందు రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టి రాష్ట్రంలో తనకు వ్యతిరేఖ పక్షమే లేకుండా ఒక్కో రాజకీయ పార్టీని తొక్కుకుంటూ ఆ పార్టీ ఆనవాలు కూడా లేకుండా భూస్థాపితం చేసేసారు.
అందులో టి. టీడీపీ కూడా ఒక బాధిత పార్టీనే. అలాగే కాంగ్రెస్, బీజేపీ లో ఉన్న బడా నాయకులందరినీ తన పార్టీ కారెక్కించి కొన్నేళ్లపాటు రాష్ట్రంలో ఆ పార్టీల మనుగడ లేకుండా చేయగలిగారు. అలాగే విభజన తరువాత ఏపీని సరైన గాడిలో పెట్టగల విజనరీ నాయకుడు బాబే అని టీడీపీ పార్టీకి పట్టం కట్టారు ఏపీ ప్రజలు.
అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ తన ప్రతిపక్షమైన వైసీపీ ని చాల తక్కువ అంచనా వేసిందో…లేక రాష్ట్రానికి అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే అవసరం అనే పాత కాలం నాటి రాజకీయ సంప్రదాయాలకు కట్టుబడ్డారో…కానీ ప్రతిపక్షమైన వైసీపీ పార్టీ కి పూర్తి స్వేచ్ఛ కల్పించారు.
అది ఎంతలా తయారయ్యింది అంటే సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి బాబునే నడి రోడ్డు మీద ఉరి తీయాలి…చీపుర్లతో కొట్టాలి అని బహిరంగ వేదికల మీద ప్రతిపక్ష నేత మాట్లాడేంత. అలాగే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ జగన్ ఆడిన కోడికత్తి, వివేకా గుండె పోటు వంటి రాజకీయ క్రీడలకు బాబు సరైన చెక్ పెట్టలేక పోలవరం…అమరావతి..అంటూ మోనంగా ఉండి పోయారు. ఇవన్నీ కలిసి జగన్ కు ఒక్క ఛాన్స్ అవకాశం తెచ్చిపెట్టాయి.
ఆ ఒక్క ఛాన్స్ తో వచ్చిన అవకాశన్ని జగన్ కూడా కేసీఆర్ మాదిరి రాష్ట్ర అభివృద్ధికి కాకుండా తన పార్టీ అభివృద్ధి మీద ద్రుష్టి పెట్టారు. ముందు ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి ఆ తరువాత రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లను ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజలకు దూరం చేసారు. అందుకు జగన్ ఎంచుకున్న విధానం ‘నువ్వు నిర్మిస్తే…నేను కూలుస్తా’ అనే పతకాన్ని రాష్ట్ర ప్రజలకు తొలిసారి పరిచయం చేసి రాష్ట్రంలో కొత్త సంస్కృతులను తెరమీదకు తెచ్చారు.
అందులో భాగంగానే ప్రజావేదిక…రాజధాని అమరావతి…ఏపీ ప్రజల జీవనాధారం పోలవరం… గత ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పెట్టిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్ ను కాదనుకుని తిరుగు పయనమయ్యాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాల్సిన అసెంబ్లీ సభలను బూతులతో ప్రతిపక్ష నాయకులను కించపరచడానికి, వారి ఇంట్లో ఆడవారిని అవమానించడానికి అడ్డాగా మార్చారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే ఈ విధ్వంస ఖాండ జరగడం దానికి ఆయన షిక్కటి చిరునవ్వులు చిందించడం…ద్వాపర యుగం నాటి కౌరవ సభను తలపించింది.
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించిన వారి పై కేసులు, నోరెత్తిన వారి పై దాడులు, అడ్డుకున్న వారి పై అరెస్టులు అంటూ ఒక నియంత పాలనను తలపించారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ వినని బూతులు తిట్టించుకుంటూ, ఎన్నడూ చూడని రాజకీయ గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు బాబు. ఒక ప్రతిపక్ష నేత అరెస్టయ్యి జైలుకు వెళ్తే ఆయన చావు గురించి, చావు మీద అవహేళనగా మాట్లాడుతూ కుటుంబం సభ్యుల మీద నిందారోపణలు చేస్తూ వారిని కించరుస్తూ జగన్ చేసిన రాజకీయానికి ఎం పేరు పెట్టాలి..?
ఇందుకేనా ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలు చేసింది. ఇందుకేనా తండ్రి పేరుని అడ్డుపెట్టుకుని రాజకీయ పార్టీ పెట్టింది. ఇందుకేనా తల్లిని, చెల్లిని రాజకీయ వేదికల మీదకు తీసుకువచ్చింది. ఇందుకేనా 151 సీట్లు సాధించింది. ఒకరి చావు మీద రాజకీయ పునాదులు వేసుకున్న పార్టీ ఆ చావునే కోరుకుంటుంది అనేలా ఎప్పుడు ఎవరొకరి చావుల మీద రాజకీయ విమర్శలు చేయడం వైసీపీ నాయకులకు ఆనవాయితీగా మారిపోయింది.
కర్రలు చేత పట్టుకుని ఒకరు, నోటికి పని చెపుతూ ఒకరు, అసభ్యకర సైగలు చేస్తూ మరొకరు ఇలా ప్రతిపక్ష పార్టీల నేతలను అవమానించడానికే అధికారం అన్నటుగా ఇన్నాళ్ల వైసీపీ పాలన గడిచింది. అభివృద్ధి అనేది మచ్చుకైనా లేకున్నా సంక్షేమ కార్యక్రమాలనే నమ్ముకుని ముందుకెళ్తున్న వైసీపీ ఇప్పటికే తానూ నొక్కిన బటన్లకు రాష్ట్ర ప్రజల పై మోయలేని అప్పుల భారాన్ని, పన్నుల మోతను వేస్తూ రాష్ట్రానికి దాదాపు 6 లక్షల కోట్ల అప్పుని సాధించింది….ప్రభుత్వాల మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టింది.






