మూడు రాజధానుల పేరుతో ఏపీకి ఒక్క రాజధాని కూడా లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం, రాజధాని కేసుని సుప్రీంకోర్టు మార్చి 28కి వాయిదా వేయడంతో ఇప్పుడు విశాఖ రాజధానికి మరో కొత్త ముహూర్తం ప్రకటించింది. ఉత్తరాంద్ర వైసీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి మంగళవారం శ్రీకాకుళంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, “న్యాయపరమైన అన్ని చిక్కులు తొలగిన తర్వాత ఏప్రిల్ నెలలో విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తాము. విశాఖ నుంచే సిఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తారు,” అని స్పష్టం చేశారు.
మంత్రి హోదాలో ఉన్నప్పటికీ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, “వైసీపీకి ప్రతీ ఇంట్లో గూఢచారులున్నారనే సంగతి మరిచిపోవద్దు. ఎక్కడ ఏం జరిగినా వెంటనే మాకు తెలిసిపోతుంటుంది. కనుక త్వరలో జరుగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరైనా పార్టీ అభ్యర్ధిని కాదని స్వతంత్ర అభ్యర్ధికి ఓటు వేస్తే పార్టీలో నుంచి సస్పెండ్ అవుతారని గుర్తుంచుకోండి. విశాఖని రాజధాని చేయడానికి మన సిఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. విశాఖ రాజధాని అయితేనే మన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందుతుంది. అది మీకు ఇష్టమేనా కాదా చెప్పండి? విశాఖ రాజధాని కావాలనుకొనేవారందరూ తప్పనిసరిగా వైసీపీకే ఓట్లు వేయాలి,” అని అన్నారు.
రాజధాని అంశంపై వేసిన పిటిషన్ని త్వరగా విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని పదేపదే అభ్యర్ధిస్తున్నా వాయిదా వేస్తోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసింది మరోసారి వాయిదా వేసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ విచారణ చేపట్టినా వైసీపీ రాజకీయ అవసరాలు, రాజకీయ ప్రయోజనాల కోసం వెంటనే తీర్పు చెప్పదు. ఈ కేసు విచారణలో అమరావతి రైతులతో సహా పలువురు పాల్గొనబోతున్నారు. కనుక వారందరి వాదనలు కూడా వినాల్సి ఉంటుంది. మద్యలో మరెవరైనా పిటిషన్ వేస్తే దానినీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. కనుక విశాఖ రాజధానికి వైసీపీ ముహూర్తం పెట్టేసుకొన్నంత మాత్రన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించేయదు.
ఒకవేళ ప్రకటించినా విశాఖకి ప్రభుత్వ కార్యాలయాలని, వాటి అధికారులు, ఉద్యోగులని, సచివాలయ సిబ్బందిని తరలించడానికి చాలా సమయం పడుతుంది.
కానీ కాస్త ఆలస్యమైనా ఎన్నికలలోగా సుప్రీంకోర్టు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెపితే చాలు! ఆ తీర్పుతో వైసీపీ ధైర్యంగా ఎన్నికలకి వెళ్ళగలుగుతుంది. మళ్ళీ మూడు ప్రాంతాలలో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి టిడిపి, జనసేనలని దెబ్బతీసేందుకు వైసీపీకి అప్పుడు మంచి అవకాశం లభిస్తుందని చెప్పవచ్చు. అందుకే రాజధాని అంశంపై సుప్రీంకోర్టు తీర్పు కోసం వైసీపీ అంతగా ఆరాటపడుతోందనుకోవచ్చు. కానీ వ్యతిరేకంగా వస్తే?
—



