చూస్తూ ఉండగానే 2025 గిర్రున తిరిగి పోయింది. ఓసారి ఈ 12నెలలని రీవైండ్ చేసుకుంటే అనేక గొప్ప విషయాలు, అనేక చేదు జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతాయి. జీవితం అంటే ఇలాగే ఉంటుంది. ఈ ప్రపంచం కూడా ఇలాగే పడుతూ లేస్తూ సాగుతుంటుంది. కనుక ఏదో జరిగిందని లేదా ఏదీ జరగలేదని అనుకోవాల్సిన పనిలేదు. వర్తమాన చరిత్రకు మనం కేవలం సాక్షులు మాత్రమే.
ఈ ఏడాది రాజకీయాలలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు, విజయం సాధించిన సినిమాల గురించి ఈ సందర్భంగా ఓసారి మననం చేసుకుంటే…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో తిరుగు లేదనుకున్న కేసీఆర్, జగన్ తుడిచి పెట్టుకుపోయారు. బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది. కవితని బయటకు గెంటేశారు. ఆమె సొంత కుంపటి రాజేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ప్యాలస్, ఫామ్హౌసు రాజకీయాలు చేస్తూ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. అధినేతలు ఇంటి గడప బయట కాలుపెట్టకుండానే పార్టీలను నడిపించవచ్చని ఇద్దరూ నిరూపిస్తున్నారు.
గత ఏడాది ఏపీలో ప్రభుత్వం మారినప్పటి నుంచి రాష్ట్రానికి మహర్దశ మొదలైంది. అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటి పదాలు ఇప్పుడు నిత్యం వినపడుతున్నాయి.
సిఎం చంద్రబాబు నాయుడు గతంలో కంటే ఇప్పుడు సామాన్య ప్రజలతో ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్లో విభిన్నకోణాలు ఒకటొకటిగా ఆవిష్కృతమవుతున్నాయి. మంత్రి నారా లోకేష్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
జాతీయ స్థాయిలో చూస్తే పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సింధూర్, ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్, బీహార్ ఎన్నికలలో మళ్ళీ ఎన్డీయే కూటమి విజయం సాధించడం, ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహార్లో ఎదురు దెబ్బతినడం వంటివి కనిపిస్తాయి.
సినీ పరిశ్రమ విషయానికి వస్తే ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్ వంటి అగ్రనటులు అందరూ తమతమ సినిమాలతో లాక్ అయిపోయారు.
కానీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్స్ ఈ ఏడాది హిట్స్ కొట్టారు. ‘మహావతార్ నరసింహ’ యానిమేషన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం మరో విశేషం.
ఈ ఏడాది అనేక మీడియం, లోబడ్జెట్ సినిమాలు విజయం సాధించాయి. మిరాయ్, తండేల్, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్, హిట్-3, భైరవం, లిటిల్ హార్ట్స్, ది గర్ల్ ఫ్రెండ్, రాజు వెడ్స్ రాంబాయి, ఆంధ్రా కింగ్ తాలుకా వంటి పలు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అఖండ-2 వివాదాల సరిహద్దులు దాటి విజయ పతాకం ఎగురవేసింది.







