ఒక్క ఛాన్స్ విలువ తెలుసుకోలేక….

ABP-C Voter: War One Side In Andhra Pradesh

గత ఎన్నికలలో అనూహ్యంగా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపి ప్రజలు ఇచ్చిన ఆ ‘ఒక్క ఛాన్స్’ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆ ఒక్క ఛాన్స్ కోసం జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఎంతగా తపిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. జగన్‌ కూడా ఎంతో కష్టపడితేనే ఒక్క ఛాన్స్ లభించింది. కానీ ప్రజలు తన నుంచి ఏమి కోరుకొని అధికారం కట్టబెట్టారో గ్రహించకుండా ఐదేళ్ళలో ఇష్టారాజ్యం చేశారు!

అయినా ఇప్పుడు తనకే ‘రెండో ఛాన్స్’ కూడా ఇస్తారని అనుకొంటున్నారు. పార్టీలో అందరినీ కూడా అదే గుడ్డి భ్రమలో ముందుకు నడిపిస్తున్నారు.

ADVERTISEMENT

కానీ రెండో ఛాన్స్ కష్టం అని సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి. బహుశః సొంత సర్వేలు, ఐప్యాక్, నిఘా వర్గాలు కూడా ఈపాటికి చెప్పేసే ఉంటాయి.

ప్రతీ మనిషి ఏదో రోజు చనిపోతాడు. కానీ ఫలానా సమయంలో చనిపోవచ్చని ముందే తెలిస్తే ఆ భయం చాలా భయంకరంగా ఉంటుంది. ప్రస్తుతం వైసీపి పరిస్థితి కూడా ఇదే.

ఈసారి ఎన్నికలలో ఓటమి తప్పదని ముందే స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయి. తెలంగాణ ఎన్నికలలో ఓడిపోయిన కేసీఆర్‌ ఇప్పుడు ఎంత అసహనంతో రగిలిపోతున్నారో, ఎన్నికలను ఎదుర్కొబోతున్న జగన్‌ కూడా అంతే అసహనంతో రగిలిపోతుండటం గమనిస్తే ఓటమిని గుర్తించిన్నట్లే అర్దమవుతోంది.

జగన్‌ ప్రసంగాలలో ఇంత అసహనం వినిపిస్తోంది. ప్రతిపక్షాలపై దాడులు కూడా ఓటమి భయం, ఆందోళనతో చేస్తున్నవే అని భావించవచ్చు.

ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారని ఏబీపి న్యూస్- సీఓటర్ ఒపీనియన్ పోల్‌ స్పష్టం చేసింది. వాటి తాజా సర్వే ప్రకారం ఈసారి లోక్‌సభ ఎన్నికలలో టిడిపి-13, బీజేపీ-5, జనసేన-2 కలిపి మొత్తం 20 ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్నాయి. కానీ ఈసారి వైసీపి కేవలం 5 ఎంపీ సీట్లకే పరిమితం కాబోతోందని తెలిపాయి.

ఆ ప్రకారమే నాలుగు పార్టీల ఓట్ల శాతం కూడా ఉండబోతోంది. టిడిపి, జనసేన, బీజేపీల కూటమికి 46.7 శాతం ఓట్లు, వైసీపికి 39.9 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఇతరులకు 11.4 శాతం, కాంగ్రెస్‌ పార్టీకి 1.9 శాతం ఓట్లు లభించవచ్చని పేర్కొంది.

మరో ప్రముఖ మీడియా సంస్థ న్యూస్ ఎక్స్‌ సర్వేలో టిడిపి, జనసేన, బీజేపీల కూటమి 18 సీట్లు, వైసీపి 7 ఎంపీ సీట్లు గెలుచుకోబోతోందని తెలిపింది. ఇంకా పలు మీడియా సంస్థల సర్వేలు కూడా ఈసారి ఎన్నికలలో టిడిపి, జనసేన, బీజేపీల కూటమి విజయం సాధించబోతోందని తేల్చి చెపుతున్నాయి.

ఒక్కో లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోనే అనేక శాసనసభ నియోజకవర్గాలు కూడా ఉంటాయి. కనుక శాసనసభ ఫలితాలు లోక్‌సభ ఫలితాలకు అనుగుణంగానే ఉంటాయి.

ఈ సర్వేలన్నీ బోగస్ అని వైసీపి కొట్టిపడేసినా, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అమరావతి రైతులు, పారిశ్రామిక వర్గాలు, చివరికి సామాన్య ప్రజలలో కూడా జగన్‌ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కనుక ఆ వ్యతిరేకతే ఈసారి వైసీపి ఓటమికి కారణం కాబోతోంది. అయితే ఒక్క ఛాన్స్ విలువ తెలుసుకోకుండా వ్యవహరించినందునే ఈవిదంగా జరుగబోతోంది కనుక ఇందుకు చంద్రబాబు నాయుడు లేదా పవన్‌ కళ్యాణ్‌లను నిందించడం అనవసరమే. ఇది స్వయంకృతమే కనుక వైసీపి నేతలు తమని తామే నిందించుకోవలసి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories