
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి నటించిన అర్జున్ S/o విజయశాంతి ఏప్రిల్ 18, 2025న విడుదలై మిశ్రమ స్పందన పొందింది. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 19న హైదరాబాద్లో జరిగిన సక్సెస్ మీట్లో కళ్యాణ్ రామ్, విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కళ్యాణ్ రామ్ చిత్రం యొక్క క్లైమాక్స్, వసూళ్లు, బ్రేక్ఈవెన్ అవకాశాల గురించి మాట్లాడగా, విజయశాంతి విమర్శకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కళ్యాణ్ రామ్ చిత్రం యొక్క బాక్స్ ఆఫీస్ పనితీరుపై ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. “మా సినిమా తొలిరోజు గట్టిగా ఆడింది. ఇది బ్రేక్ఈవెన్కు సమీపంలో ఉంది” అని ఆయన పేర్కొన్నారు, చిత్ర క్లైమాక్స్పై కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. “క్లైమాక్స్ కోసం అనేక వెర్షన్లను తిరస్కరించాం, చివరకు తెలుగు సినిమాలో ఇప్పటివరకు చూడని ఒక ఆలోచనతో ముందుకొచ్చాం,” అని చెప్పారు. తన కొడుకు క్లైమాక్స్ను చూసి భావోద్వేగానికి గురైన సంఘటనను పంచుకుంటూ, ఈ సన్నివేశం “భారతీయ సినిమాలో అపూర్వమైన అనుభవం” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షించినప్పటికీ, చాలామంది ఇది అతిశయోక్తిగా భావించారు.
Also Read – ఇంటర్వెల్ అదుర్స్.. మరి క్లైమాక్స్..?
ఇక విజయశాంతి తన ప్రసంగంలో విమర్శకులపై తీవ్రంగా స్పందించారు. కొందరు రివ్యూ రైటర్స్ సినిమా యొక్క భావోద్వేగ లోతును అర్థం చేసుకోకుండా నీచమైన విమర్శలు చేస్తున్నారని, సినిమాను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాగున్న సినిమా బాలేదని, బాగాలేని సినిమాని బాగుందని చెప్తున్నారని ఆరోపించారు. సినిమాను హత్య చేసే వారికి ఇది హెచ్చరిక అని ఆమె తీవ్ర భాషలో చెప్పారు, ఎంతోమంది ఎన్నో హోప్స్ పెట్టుకొని ఇండస్ట్రీకి వస్తారని, సినిమా బాగుంటే చెప్పాలని, బాలేకపోతే సైలెంటుగా ఉండాలని హితబోధ చేసారు. ఈ చిత్రం తల్లులకు అంకితమని, దాని హృదయం తల్లీకొడుకు బంధమని నొక్కిచెప్పారు.
ఇంత కోపం తెచ్చుకున్న విజయశాంతి గారు ‘థియేటర్ కి వచ్చే సగటు ప్రేక్షకుడు కూడా ఎన్నో హోప్స్ పెట్టుకొని వస్తారని, వారి అంచనాలు చేరుకునేలా సినిమా తీయాలని, సినిమా నిజంగా బాగుంటే రివ్యూలు సినిమా సక్సెస్ ని ఆపలేవని’ అనుభవంతో ఆలోచించకపోవడం బాధాకరం.