‘సుడిగాడు’ తర్వాత సక్సెస్ కు దూరమై, విజయం కోసం సిల్వర్ స్క్రీన్ పైకి దండయాత్రలు చేస్తున్న ‘అల్లరి’ నరేష్ తాజాగా ‘సెల్ఫీ రాజా’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో ఈ అల్లరోడుకు ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’ వంటి హిట్ సినిమాను అందించిన ఈశ్వర్ రెడ్డికి, తనకు హిట్ ఇచ్చే బాధ్యతను అందించాడు అల్లరోడు. సాక్షి చౌదరి, కామ్న రనవాత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.
అయితే సాధారణంగా అల్లరి నరేష్ సినిమాలంటే వినోదంగానే ప్రేక్షకులు భావిస్తారు. అయితే మరొకసారి ఆ వినోదాన్ని అందివ్వడంలో, రెండు నిముషాల ధియేటిరికల్ ట్రైలర్ కు వీక్షకుల నుండి ఆశించినంత స్పందన రాలేదు. సందర్భం, సమయం ఏదైనా గానీ, తన సెల్ఫీతో పిచ్చేక్కించే వ్యక్తిగా అల్లరి నరేష్, వెండితెరపై ఎలాంటి నవ్వులు పూయిస్తాడో ఈ నెల 15వ తేదీన తేలబోతోంది. రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. దీంతో అల్లరోడు విజయ దండయాత్ర ఈ ‘సెల్ఫీ రాజా’తో అయినా ముగుస్తుందో లేదో చూడాలి.



