నాడు వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర రాజధాని అమరావతి ముంపు ప్రాంతమంటు, స్మశానం అంటూ విష ప్రచారం చేసారు. అలాగే మూడు రాజధానులు అంటూ అమరావతి లో ఒక్క ఇటుక కూడా పేర్చకుండా గత ఐదేళ్లల్లో అమరావతి నిర్మాణాలను సమాధి చేసారు
ఒక పక్క అమరావతి మునిగిపోయింది, అమరావతిలో నిర్మించిన భవనాలు శాశ్వత భవనాలు కాదు, వాటిలో నాణ్యత లేదు, అసెంబ్లీలోకి వర్షపు నీరు, అమరావతిలోకి వరద నీరు అంటూ అసత్య ప్రచారాలు చేస్తూనే మరోపక్క అదే అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు.
అలాగే అదే అమరావతి సాక్షిగా అమరావతిని రాజధానిగా రద్దు చేస్తూ విశాఖను రాజధానిగా ప్రకటిస్తూ గత ఐదేళ్లు వైసీపీ పైశాచిక ఆనందం పొందింది. ఆ వైసీపీ వికృత రాజకీయ క్రీడకు నాడు బిఆర్ఎస్ పరోక్ష మద్దతు ప్రకటించింది, తెరచాటు రాజకీయ సాయం అందించింది.
అయితే నాడు అమరావతి విషయంలో టీడీపీకి కలిగిన నొప్పి, ఏపీకి జరిగిన నష్టం నేడు కాళేశ్వరం విషయంలో బిఆర్ఎస్ కు ఎదురవుతుంది, తెలంగాణ ఎదుర్కొంటుంది. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని, ఆ ప్రాజెక్టులో తలెత్తిన చిన్న చిన్న లోపాలను అధికార పార్టీ బూతద్దంలో పెట్టి చూస్తుందంటూ ఆరోపిస్తున్నారు కేటీఆర్.
ఒక పక్క కాళేశ్వరం నుంచి వస్తున్ననీటిని వాడుకుంటూనే మరోపక్క కాళేశ్వరం కొట్టుకుపోయింది, మేడిగడ్డ కుంగిపోయింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను సరిచేయకుండా కేవలం రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పాకులాడం నీచ రాజకీయం అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగానే ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి హైద్రాబాద్ కి నీరు అందిస్తున్నారంటూ, తలా తోకా లేని సన్నాసులే ఇలా తల వదిలి తోక దగ్గర శంకుస్థాపన చేస్తారంటూ తన విమర్శలతో రేవంత్ సర్కార్ పై రెచ్చిపోయారు కేటీఆర్.
అయితే నేడు కాళేశ్వరం పై రేవంత్ సర్కార్ చేసేది నీచ రాజకీయం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కేటీఆర్ గత ఐదేళ్లు అమరావతి పై వైసీపీ చేసిన నీచ రాజకీయానికి ఎలా సాయమందించగలిగారు.?
నాడు టీడీపీ ని ఇరుకునపెట్టడానికి, వైసీపీ ని అధికారంలోకి తీసుకురావడనికి చేయూత నిచ్చిన చేతులే నేడు కాళేశ్వరం విషయంలో చేతులు కాల్చుకున్నాయా.? నాడు వైసీపీ అమరావతిలో ఉంటూనే అమరావతి పై విషం చిమ్మినట్టే, నేడు కాళేశ్వరం నీటిని వాడుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పై అభూత కల్పనలు సృష్టిస్తున్నారా.?




