తెలంగాణ రాష్ట్రంలో కేవలం 17 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి. వాటితో కేసీఆర్ ఎన్నటికీ ప్రధాని కాలేరు. కనుక తన “సహాయసహకారాలను స్వీకరించి” తన నాయకత్వాన్ని ఒప్పుకొనేవారితో దోస్తీ చేస్తూ ముందుకు సాగాలనుకొన్నారు. ఆవిదంగా దొరికిన దోస్తే కర్నాటకలో దేవగౌడ అండ్ సన్స్.
కర్ణాటకలో కాంగ్రెస్, బిజెపిల మద్య నలిగిపోతూ అధికారం కోసం ఆరాటపడుతున్న కుమారస్వామి కేసీఆర్ చుట్టూ చాలా ప్రదక్షిణాలే చేశారు. కానీ తర్వాత ఏమైందో ఏమో ఆయన కేసీఆర్ వైపు తొంగిచూడలేదు. మొదట కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోనే నా తడాఖా చూపిస్తానని గొప్పగా చెప్పుకొన్న కేసీఆర్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోతున్నా అటువైపు తొంగిచూడనే లేదు. కర్ణాటక ఎన్నికలలో బిఆర్ఎస్ పోటీ చేయకపోయినా, కుమారస్వామికి మద్దతుగా పార్టీ నేతలని కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి పంపించి ఉండవచ్చు. కానీ పంపలేదు!
కేసీఆర్ రాలేదని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆగిపోవు కనుక మే 10వ తేదీన పోలింగ్ జరుగబోతోంది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేవెళ్ళ సభలో చెప్పిన ఓ మాట కేసీఆర్ కర్ణాటకవైపు ఎందుకు తొంగిచూడలేదనే సందేహానికి చూచాయగా సమాధానం చెపుతోంది. అమిత్ షా మాట్లాడుతూ, “కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కనడంమానుకొని, ముందు తెలంగాణలో తన సీటుని కాపాడుకొంటే మంచిది,” అని అన్నారు. అంటే కర్నాటక ఎన్నికలలో వేలుపెట్టవద్దని మోడీ, అమిత్ షాల సూచన మేరకే కేసీఆర్ ఆ ఆలోచన విరమించుకొన్నారా?అందుకు ప్రతిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు బ్రేకులు వేసి కల్వకుంట్ల కవితకి ఊరట కల్పిస్తున్నారా? అనే సందేహం కలుగుతుంది.
కనుక కేసీఆర్ కర్ణాటకలో బిఆర్ఎస్ పార్టీని బరిలో దింపకపోవడానికి కుమారస్వామితో సీట్ల సర్దుబాటు కాకపోవడమే కారణమా లేక ఢిల్లీ లిక్కర్ స్కామ్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే నిన్న మొన్నటివరకు లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ తధ్యం అంటూ బిజెపి నేతలు, ఈడీ ఎంత హడావుడి చేశాయో అందరూ చూశారు. కానీ హటాత్తుగా లిక్కర్ స్కామ్ విచారణ ఆగిపోయింది! దాంతో బాటే చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కల్వకుంట్ల కవిత మొదలుపెట్టిన పోరాటాలు కూడా నిలిచిపోయాయి! కేసీఆర్ కర్ణాటక వైపు కన్నెత్తి చూడటం లేదు.
ఏది ఏమైనప్పటికీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారాలలో యూటర్న్ తీసుకొన్న కేసీఆర్ భవిష్యత్లో ఇంకెన్ని యూటర్న్స్ తీసుకొంటారో చూడాలి.



