త్వరలో తెలంగాణలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ తరుపున ప్రచారానికి గాను ఈ నెల 25 న రాష్ట్రానికి రానున్నారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా. అయితే గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ తో పొత్తుపెట్టుకున్న బీజేపీ ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగనుంది.
అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెంది నైరాశ్యంలో ఉన్న కేసీఆర్ కు ఒకపక్క కవిత లిక్కర్ కేసు, మరో పక్క కేటీఆర్ ఫోన్ టాపింగ్ కేసు ఊపిరాడకుండా చేస్తున్నాయి. దీనికి తోడు బిఆర్ఎస్ నేతలు ఒక్కక్కొరుగా పార్టీని వీడడం అన్ని బీజేపీ కి కలిసి వచ్చే అంశాలుగా మారిపోయాయి. మాజీ ముఖ్యమంత్రి చేసిన అవినీతి అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడంతో బిఆర్ఎస్ అంచెలంచలుగా తన బలాన్ని కోల్పోతూ వస్తుంది.
బిఆర్ఎస్ బాలహీనతను తన బలంగా మార్చుకోవడానికి బీజేపీ పావులు కదుపుతుంది. కవిత కేసుతో కేసీఆర్ ను కట్టడి చేసి ఆస్థానంలోకి బీజేపీ ని చేర్చాలన్నదే బీజేపీ వ్యూహంగా కనపడుతుంది. గతంలో మాదిరిగా కేసీఆర్ కూడా బీజేపీ అగ్రనాయకత్వం పైన హద్దుఅదుపు లేని విమర్శలు చేయకుండా చాలా ఆచితూచి అడుగేస్తున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న కవిత కు ఈసారి కూడా ఎదురుదెబ్బే తగిలింది.
తన కుమారుడికి త్వరలో పరిక్షలు ఉన్నాయని, అందుకు గాను తనకు బెయిలు ఇవ్వాలంటూ ఒకసారి, తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని జైల్లో అవి మరి అధికంగా తనను బాధిస్తున్నాయని మరోసారి, తమరాష్ట్రంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో తమ పార్టీ తరుపున ప్రచారంలో పాల్గొనడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ ఇలా పలు మార్లు కోర్టుకు బెయిలు కోసం అప్పీల్ చేసుకున్న కవిత బెయిలు విచారణ మరో సారి రిమాండ్ కే పరిమితమయ్యింది.
సిబిఐ అరెస్టు పై కవిత వేసిన బెయిలు పిటిషన్ తీర్పుని మే 2 కు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్ట్. అలాగే ఈడీ అరెస్టు పై వేసిన బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. దీనితో ఈసారి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ కుమార్తె శ్రీమతి కల్వకుంట్ల కవిత తన సొంత రాష్ట్రమైన తెలంగాణకు వస్తారా..? రారా..? అన్నదాని పై సర్వత్రా చర్చ ఊపందుకుంది.
అయితే ఇదే కేసులో అరెస్టయ్యి అదే తీహార్ జైల్లో ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కెజ్రీవాల్ ది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రి గా ఉన్నప్పటికీ ఈకేసులో ఆయనకు బెయిలు సాధించుకోలేకపోయారు. ఇటువంటి పరిస్థితులలో కవిత లిక్కర్ కేసు నుండి ఇప్పట్లో బయటకు రావడం అసాధ్యమే అనే అభిప్రాయంలోకి వచ్చేసారు బిఆర్ఎస్ నాయకులు.




