దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంత వరకు ఎన్నడూ ఈ స్థాయిలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం చేపట్టలేదు.
కానీ పూజా కార్యక్రమానికి ముందే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినట్లు షూటింగ్ ప్రారంభించినట్లుగా, 2026 మార్చి31కల్లా దేశంలో ఎక్కడా మావోయిస్ట్ లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందే ప్రకటించి మరీ ‘ఆపరేషన్ కగార్’ పేరుతో ఈ ఏరివేత కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే అనేక వందల మంది మావోయిస్టులు చనిపోగా, మిగిలినవారిలో అనేక వందల మంది ప్రాణభయంతో ఆయుధాలు వదిలి పోలీసులకు లొంగిపోతున్నారు. కానీ చిట్టచివరి మావోయిస్టు కూడా లొంగిపోయే వరకు లేదా ఏరి పారేసేవరకు ఈ మరణ మృదంగం మ్రోగుతూనే ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విస్పష్టంగా ప్రకటించారు.
కనుక ప్రాణం మీద ఆశ ఉన్నవారందరూ బేషరతుగా లొంగిపోవాలని, వారిని సాదరంగా సమాజంలోకి ఆహ్వానించి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ మావోయిస్టులు తమకు కొంత సమయం ఇవ్వాలని, చర్చలకు సిద్దమని లేఖలు వ్రాస్తున్నారన్నారు.
మావోయిస్టులతో ఇక మాట్లాడుకోవడాలు లేవ్… రణమో… మరణమో మీరే తేల్చుకోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెగేసి చెప్పేశారు.
కనుక మావోయిస్టులకు పోరాడి ప్రాణాలు కోల్పోవడమో లేదా లొంగిపోయి పారితోషికాలు తీసుకొని జనజీవన స్రవంతిలో కలిసిపోవడమో రెండే మార్గాలున్నాయి.
కనుక ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి జరిగి తీరుతుంది. మరో ఆర్నెలల్లో అటు బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి ఇటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక వరకు వ్యాపించి ఉన్న అడవులన్నీ ఖాళీ అవుతాయి. ఆ తర్వాత ఏంటి?
అంటే ఈ అడవులను అంబానీ, ఆదానీలకు కట్టబెట్టడానికే మోడీ ప్రభుత్వం ఇంత దమనఖండకు పాల్పడుతోందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటి ఆరోపణలే నిజమైతే ఇంత కంటే దారుణం మరొకటి ఉండబోదు.







