బీజేపీ అలవాటుగా పొరపాటుతో కాంగ్రెస్‌కు లబ్ధి?

Amith Shah

బీజేపీ హిందుత్వ అజెండాతోతో రాజకీయాలు చేస్తుందని అందరికీ తెలుసు. కనుక తమ పార్టీ విధానాలకు అనుగుణంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారు. ముస్లింలు ఎలాగూ తమ పార్టీకి ఓట్లు వేయరు కనుక వారికి వ్యతిరేకంగా మాట్లాడి హిందూ ఓటర్లను ఆకట్టుకోవాలనేది బీజేపీ వ్యూహమని అర్దమవుతూనే ఉంది.

గ్రేటర్ హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలలో ఇదే వ్యూహంతో ముందుకు సాగి బీజేపీ ఏకంగా 44 సీట్లు గెలుచుకొంది. ఆ సమయంలో బిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు కూడా బద్ధ శత్రువులులా పరస్పరం కత్తులు దూసుకొన్నాయి. దాంతో మూడు పార్టీ తమతమ ఓటు బ్యాంక్ దక్కించుకొన్నాయి. ఆ తర్వాత మళ్ళీ బిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు కలిసిపోయాయి. అది వేరే సంగతి.

ADVERTISEMENT

అయితే అప్పటికి కాంగ్రెస్‌ చాలా బలహీనంగా ఉండటం వలన వాటి ఎత్తుగడ ఫలించింది. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ పుంజుకొందనే విషయం మరిచి బీజేపీ నేతలు ఎప్పటిలాగే ముస్లింలకు వ్యతిరేకం మాట్లాడుతున్నారు.

ఇది బీజేపీ విధానమే కనుక దీంతో దానికి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. పడితే హిందూ ఓట్లు పడతాయి లేకుంటే లేదు అంతే.

ఈసారి కూడా మజ్లీస్‌ పార్టీ హైదరాబాద్‌లో కేవలం 7 సీట్లకే పరిమితం అయ్యింది. కనుక మిగిలిన 112 నియోజకవర్గాలలో బీజేపీని వ్యతిరేకించే ముస్లింలు బిఆర్ఎస్‌ పార్టీకి ఓట్లు వేస్తారనుకోవడం సహజం. ఎందుకంటే దానికి మజ్లీస్‌తో దోస్తీ ఉంది. మద్దతు కూడా ఇస్తోంది కనుక.

కానీ బిఆర్ఎస్‌, బీజేపీల మద్య రహస్య అవగాహన ఉందని, అందుకే కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయలేదని, కాంగ్రెస్‌ అభ్యర్ధుల ఇళ్ళపైనే ఐ‌టి దాడులు జరుగుతున్నాయని, కేసీఆర్‌ ఒత్తిడి మేరకే బండి సంజయ్‌ని అధ్యక్ష పదవిలో నుంచి తప్పించేసుకొందని కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారం తెలంగాణలో ముస్లిం సమాజాన్ని ఆలోచింపజేస్తోంది.

లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్‌, కేటీఆర్‌ పదేపదే చెపుతున్నారు. అప్పుడు కేసీఆర్‌ ఎటుపక్క ఉంటారు? కాంగ్రెస్‌, బీజేపీ?

అంటే శాసనసభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌, మళ్ళీ మోడీ పంచన చేరుతారని కాంగ్రెస్‌ వాదిస్తోంది. అది చేస్తున్న ఈ ప్రచారం తెలంగాణలో ముస్లిం సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. బీజేపీని వద్దనుకొనే బిఆర్ఎస్‌కి ఓట్లు వేస్తే అది వెళ్ళి మళ్ళీ బీజేపీతో కలుస్తుందంటే దానికి ఎందుకు ఓట్లు వేయాలి?అని ఆలోచిస్తే వారందరూ కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.

ఎన్నికలు జీహెచ్‌ఎంసీకి మాత్రమే పరిమితమైనప్పుడో లేదా రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్నప్పుడో బీజేపీ ముస్లిం వ్యతిరేకత ప్రదర్శిస్తే దాని వలన బిఆర్ఎస్‌ లేదా మజ్లీస్‌ లబ్ధిపొందుతాయి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పుంజుకొన్నప్పుడు కూడా బీజేపీ అలవాటులో పొరపాటుగా ముస్లిం వ్యతిరేకత ప్రదర్శిస్తే, ముస్లింలు లౌకికవాడ కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపవచ్చు. ఒకవేళ ఇదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పరోక్షంగా సహాయపడిన్నట్లే భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories